కొవిడ్ మహమ్మారి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నది.ఎటు చూసినా భయం కలిగించే వార్తలే వినిపిస్తున్నాయి. తెల్లారితే చాలు, ఏం వినాల్సి వస్తుందోనన్న ఆందోళన. ఇలాంటి సమయంలో తన పాటలద్వారా అందరిలో ఆత్మ స్థయిర్యాన్ని, రేపటి గురించిన ఒక పాజిటివ్ ఆలోచనను రేకెత్తిస్తున్నది ఢిల్లీకి చెందిన కశ్మీరీ మ్యుజీషియన్ ప్రజ్ఞా వాక్లూ.
ప్రజ్ఞ 2020 లాక్డౌన్లోనే ఒక నిమిషం వీడియో సాంగ్తో ప్రారంభించింది. ఈ ఏడాది ‘సాంగ్ ఆఫ్ హోప్’ పూర్తి పాటను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ గీతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. రానున్న రోజుల్లో మన సమస్యలన్నీ దూరమవుతాయంటూ తన పాటద్వారా నలుగురిలో పాజిటివ్ దృక్పథాన్ని అలవరుస్తున్నది ప్రజ్ఞ. ‘ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నా పాటతో కాస్తంత ధైర్యాన్ని అందించాలనుకున్నాను”
అంటున్నది ప్రజ్ఞ. ఆమె చేసిన ‘లెసెన్స్ ఇన్ లవ్’ ఆల్బమ్లో ఈ ‘హోప్ ఆఫ్ సాంగ్’ కూడా ఒకటి. ప్రజ్ఞకు తిమింగలాలు అంటే ఇష్టం. ఆ ప్రేమకొద్దీ ‘వేల్ సాంగ్’ను కూడా తయారు చేసింది. త్వరలో మరిన్ని ఆల్బమ్స్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్నది.