స్వతంత్ర తెలంగాణ రాష్ర్టానికి ఏడేండ్లు! రాష్ట్ర అవతరణ తర్వాత పుట్టిన బిడ్డల్లో చాలామంది ఐదారేండ్ల పిల్లలే! ఆ చిన్నారులకు ఏ ఫర్ యాపిల్తో పాటు ఏ ఫర్ ‘అమరవీరులు’ అనీ చెప్పాలి. బి ఫర్ బాల్ అనే కాదు, బి ఫర్ ‘బతుకమ్మ’ అన్నదీ తెలియజెప్పాలి. మన గడ్డకో చరిత్ర ఉందని, ఈ నేల త్యాగాల ఫలమనీ బోధించాలి. ఆత్మాభిమాన అక్షరాభ్యాసానికి అవతరణ దినోత్సవాన్ని మించిన సుముహూర్తం ఏముంటుంది? ప్రారంభించండి మలి ఉద్యమ తొలి పాఠం! చెప్పించండి జై తెలంగాణ నినాదం!
అరవై ఏండ్ల తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు జోహార్! తొలిదశ ఉద్యమం (1969)లోనే దాదాపు 400 మంది ప్రాణాలు అర్పించారు. మలిదశ నాటికి ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ఉద్యమం కోసం ఉరికొయ్యలను కౌగిలించుకొన్నారు, బానిసత్వపు చీకట్లను పారదోలడానికి ఒంటిని కాగడాల్లా వెలిగించుకొన్నారు. వివక్షను ప్రశ్నిస్తూ పురుగు మందులను పాయసాన్నంలా భుజించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపాలు బోనాలు, బతుకమ్మ పండుగలు. స్వరాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నది. తొమ్మిది రోజులపాటు తీరొక్కపూలతో జరిగే ఉత్సవం దేశంలోనే తొలి పూల
వేడుక. ఆషాఢంలో జరుపుకొనే బోనాలకు ఎనలేని విశిష్టత ఉంది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఆటలూ, బోనాల పాటలూ ఓ భాగమయ్యాయి.
శత్రుదేవో భవః మన కడుపు కొట్టినవాడు, మన ఉనికిని ప్రశ్నించినవాడు, మన బువ్వ లాక్కున్నవాడు, మన నీళ్లు దోచుకున్నవాడు, మన నిధులు తన్నుకెళ్లినవాడు.. మన బలమేమిటో మనకు గుర్తుచేశాడు. చంద్రబాబు రెండుకండ్ల సిద్ధాంతం వల్లె వేసినందుకే తెలంగాణ ప్రజానీకం మూడోకన్ను తెరిచింది. ప్రతినాయకుల ప్రస్తావనతోనే ఏ గెలుపు కథకైనా పరిపూర్ణత సిద్ధిస్తుంది.
రెండో దశ ఉద్యమంలో ‘ధూంధాం’లు దుమ్మురేపాయి. ఆ ఆటలు, ఆ పాటలు, ఆ కేకలు, ఆ అరుపులు.. ఉద్యమావేశానికి ఇంధనం అయ్యాయి. కొత్త పాటలెన్నో ప్రాణం పోసుకున్నాయి. కొత్త గాయకులు పుట్టుకొచ్చారు. అదో పెద్ద సాంస్కృతిక సైన్యం!
తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష పుట్టిందే ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ అనే సిద్ధాంతం మీద. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ప్రతి చోటా తీవ్ర అన్యాయమే జరిగింది. ముఖ్యంగా నియామకాల విషయంలో! స్వరాష్ట్రం సాధించాక కేవలం ఆరేండ్లలోనే తెలంగాణ సర్కారు టీఎస్పీఎస్సీ, పోలీస్ శాఖలద్వారా లక్షా 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చింది. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ
చేయనుంది.
లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు. చారిత్రక ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు లోక్సభలో ఆమోద ముద్ర లభించింది. ఫిబ్రవరి 20న రాజ్యసభ కూడా మద్దతు తెలిపింది. రాష్ట్రపతి రాజముద్ర తర్వాత 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.
తెలంగాణ సాధించడం ఒక ఎత్తు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని కోరుకున్నట్టు తీర్చిదిద్దుకోవడం మరొక ఎత్తు. గవర్నెన్స్ అం అదే! పాలనా పరంగా తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ సర్కారుగా మన్ననలు అందుకుంటున్నది. కాళేశ్వరంతో నేల సస్యశ్యామలమైంది. యాదాద్రితో మనకంటూ ఓ ఆధ్యాత్మిక కేంద్రం సిద్ధమైంది. కట్టుదిట్టమైన పోలీసింగ్తో శాంతికి భద్రత లభించింది. ధరణితో కబ్జాలకు కళ్లెం పడింది. రైతుబంధుతో ఆత్మహత్యలు ఆగాయి. ప్రతి పథకం తెలంగాణ తల్లి మెడలో పచ్చల పతకమే!
ఈ మహానగరం తెలంగాణ ఆత్మ! బహుళజాతి సంస్థల చిరునామా. కొలువుల ఖజానా. అభివృద్ధి నమూనా. ఔషధ నగరి. ఐటీ పురి. తెలంగాణ ప్రజలు గోల్కొండ కోటకు రాళ్లెత్తారు. చార్మినార్ నిర్మాణానికి పునాదులు తవ్వారు. మన కులీ, మన నిజాం.. ఈ నగర సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు.
తెలంగాణ భాషను చూసి నవ్వారు. తెలంగాణ భోజనాన్ని అసహ్యించుకున్నారు. తెలంగాణ సంస్కృతిని గేలి చేశారు. తన గడ్డమీదే తెలంగాణ బిడ్డ ద్వితీయ శ్రేణి పౌరుడిగా బతకాల్సిన పరిస్థితి. కాబ్ట, తెలంగాణ ఉద్యమం ‘నేను.. నా జాతి’ అన్న ఆత్మగౌరవ నినాదాన్ని భుజానికెత్తుకుంది.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్. కొత్తపల్లి జయశంకర్సార్ వరంగల్ జిల్లాలోని అక్కంపేటలో 1934 ఆగస్టు 6న జన్మించారు. తెలంగాణ స్వేచ్ఛకోసం తుదిశ్వాస విడిచే వరకూ పోరాడారు. అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా ఆయన మాట, రాత, ఆలోచన, అంతర్మథనం.. ఎప్పుడూ తెలంగాణ చ్టు! జయశంకర్సార్ భావాల బాటలో నడుస్తున్నది మన తెలంగాణ సర్కారు.
ఒక ఉక్కు సంకల్పం. స్వరాష్ట్ర సాధనకోసం బరిగీసి, కొట్లాడిన వ్యక్తి. నమ్మిన సిద్ధాంతం కోసం పదవుల్ని సైతం వదులుకున్న ఆదర్శ నేత. తెలంగాణ ప్రజల వెతలు, బాధలు తీరాలం రాష్ట్ర సాధనే మార్గమని నమ్మి, చావునోట్లో తల పెట్టి, మృత్యువును గెలిచి.. స్వరాష్ర్టాన్ని సాధించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు .. తెలంగాణ జాతిపిత!
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగుస్తున్నాయి, అంతలోనే పడిపోతున్నాయి. అనేక పోరాటాలు మొదలైనంత వేగంగానే కనుమరుగై పోతున్నాయి. కానీ, మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ నడిపిన తీరు ఓ నాయకత్వ పాఠం. వంటావార్పులు, ధూమ్ధామ్లు, బతుకమ్మలు, బోనాలు.. అన్నీ కలగలిపి ఉద్యమాన్ని ఆయన ఓ ఉత్సవంగా మార్చారు. సామాన్యులనూ భాగస్వాములను చేశారు. అలా అని గల్లీలోనే ఆగలేదు. ఢిల్లీకి వెళ్లారు. ఎక్కని గడపలేదు. దిగని గడపలేదు. జాతీయ స్థాయి నాయకులందర్నీ కలిశారు. మద్దతు కూడగట్టారు. అంతర్జాతీయ మీడియా దృష్టినికూడా ఆకర్షించారు. సుస్పష్టమైన లక్ష్యంతోనే ఇదంతా సాధ్యమైంది. కేసీఆర్ దార్శనికత కారణంగానే దశాబ్దాల కల నెరవేరింది.
తెలంగాణ ఉద్యమచరిత్రలో మర్చిపోలేని మైలురాయి మిలియన్ మార్చ్. 2011 మార్చి 10న తెలంగాణ ప్రజానీకం చేపట్టిన మహత్తర కార్యక్రమం ఇది. ఉద్యమకారులకు, ప్రజలకు మానసిక ధైర్యాన్నిచ్చింది. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి జేఏసీలు పోలీసు పహరాను దాటుకొని, బారికేడ్లను ఛేదించుకొని, ప్రాణాలకు తెగించి హైదరాబాద్ చేరుకున్నాయి. అప్పటికే లక్షమందికిపైగా ఉద్యమకారులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినా, ప్రజా ఉద్యమాలకు అఖిలపక్ష పార్టీలు తోడై వందలు వేలై.. లక్షలమంది జనం హైదరాబాద్ చేరుకొని ట్యాంక్బండ్పై తెలంగాణ నినాదాన్ని గట్టిగా వినిపించారు. నగరమంతా ఉద్యమకారులతో నిండిపోయింది. ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తింది. దెబ్బకు ఢిల్లీ దిగొచ్చింది.
తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తయితే, ఆ ఉద్యమాన్ని భుజానికెత్తుకొని ప్రజల్లోకి తీసుకెల్లే మాధ్యమం ఒక ఎత్తు. మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న క్రమంలో నాటి ఆంధ్రప్రదేశ్లోని మీడియా సంస్థలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసే కుట్రలు పన్నాయి. మనకంటూ సొంతంగా ఓ మాధ్యమం, మన యాస భాషలకు, పోరాటాలకు కొంగొత్తగా ఊపిరులూదే పత్రిక కావాలన్న లక్ష్యంతో పదేండ్ల క్రితం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఆవిర్భవించింది. ఉద్యమం నుంచి ప్రగతిపథం వరకూ ప్రతీ బాధ్యతనూ విజయవంతంగా నిర్వహిస్తున్నది.
ఉస్మానియా ఉద్యమాల అమ్మచెట్టు, అక్షరాల పెద్దబాల శిక్ష. ఓయూ పేరు విం చాలు ‘స్వేచ్ఛ నా జన్మహక్కు’ అన్న నినాదం గుర్తుకొస్తుంది. ఈ ఆవరణ విద్యార్థులకు ఆత్మగౌరవ పాఠాలు నేర్పింది. తొలి దశ తెలంగాణ ఉద్యమం నుంచి మలిదశ పోరాటం వరకూ ఇక్కడినుంచే యువతకు దిశా నిర్దేశం. మొత్తం ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యం ఓయూ. లాఠీ దెబ్బలనూ, తుపాకుల మోతలనూ తట్టుకుని, తల ఎగరేసిన తెలంగాణ జెండా ఉస్మానియా!
1956లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒకే రాష్ట్రంగా ఏర్పడటానికి కోస్తా, రాయలసీమ, తెలంగాణ… అన్ని ప్రాంతాల నాయకులూ ఓ అంగీకారానికి వచ్చారు. నాటి కేంద్ర హోం మంత్రి గోవింద వల్లభ పంత్ సమక్షంలో ఢిల్లీలో ఈ ఒప్పందం జరిగింది. అయితే, తెలంగాణ అభివృద్ధిపై స్థానిక నాయకులకు కొన్ని సందేహాలు రావడంతో వాటిని నివృత్తి చేసేందుకు 14 అంశాలపై ఒప్పందం చేసుకున్నారు. అదే ‘పెద్ద మనుషుల ఒప్పందం’. దీనిపై సంతకం చేసిన సభ్యులు 8 మంది. వీరిలో తెలంగాణ నుంచి నలుగురు, ఆంధ్రా నుంచి నలుగురు. అయితే, మూడు ప్రాంతాలూ ఒకే రాష్ట్రంగా ఏర్పడటంతో ఆంధ్రాప్రాంత నాయకులు ‘పెద్దమనుషుల ఒప్పందాన్ని’ యథేచ్ఛగా ఉల్లంఘించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారు. దీంతో స్వరాష్ట్ర ఆకాంక్ష పురుడు పోసుకుంది.
కుతుబ్ షాహీ వంశస్థాపకుడు సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్. 16వ శతాబ్దం ప్రారంభంలో కొందరు బంధువులు, స్నేహితులతో ఢిల్లీకి వలస వచ్చాడు. బహమనీ సుల్తాన్ మహమ్మద్ షా కొలువులో పనిచేశాడు. అనంతరం గోల్కొండ ప్రతినిధి అయ్యాడు. బహమనీ సుల్తానుల సామ్రాజ్యం పతనమవుతుండటంతో, కులీ కుతుబ్ షా గోల్కొండ కేంద్రంగా జెండా ఎగరేశాడు. భాగ్యనగరాన్ని నిర్మించారు. తెలంగాణ కవులను గౌరవించారు. అసఫ్ జాహీలూ అంతే! ఏడు తరాల పాలకులూ నేటికీ ప్రజల హృదయాల్లో చిరంజీవులే. మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ను
ఆధునిక నగరంగా తీర్చిదిద్దాడు.
కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది వీరనారి రాణి రుద్రమదేవి. కాకతీయుల పాలనలో తెలంగాణ జెండా నలుదిక్కులకూ విస్తరించింది. ఓరుగల్లు కళా సాంస్కృతిక రంగాలకు కేంద్రమైంది. తెలంగాణలో వ్యవసాయం నేటికీ విరాజిల్లుతున్నదం అది కాకతీయుల చలవే. రుద్రమదేవి స్ఫూర్తితో ఎంతోమంది మహిళలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమచరిత్రలో మరో మైలురాయి సకల జనుల సమ్మె. 2011 సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభమైన ఈ సమ్మె దాదాపు 42 రోజులపాటు ఉధృతంగా సాగింది. ఈ సుదీర్ఘ సమ్మెలో తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మికులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు,విద్యార్థులు పాల్గొన్నారు. దీని ప్రభావంతో అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. రైళ్లను నిలిపి వేశారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. పల్లెలనుంచి పట్టణాల వరకూ ‘జై తెలంగాణ’ నినాదం హోరెత్తింది.
ప్రాంతీయ భావనకు మాతృరూపం తెలంగాణ తల్లి!అప్పటికే తెలుగు తల్లి ఉండంగా, తెలంగాణ తల్లేమిటని ఆంధ్రా నాయకులు హేళన చేశారు. సవతి తల్లి తల్లి ఎలా అవుతుంది? తెలంగాణ తల్లి భావన పూర్వం నుంచి ఉన్నదే అయినా, ఆ విషయాన్ని ఉద్యమ ప్రతీకగా ముందుకు తీసుకు రావాలన్న ఆలోచన మాత్రం సారథి కేసీఆర్దే. మన సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రతీకగా తెలంగాణ తల్లికి ఓ రూపాన్నీ, ఆహార్యాన్నీ కల్పించారు. తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని 2007 నవంబర్ 15న తెలంగాణ భవన్లో ఆవిష్కరించారు.
విభజన తప్పదని అర్థమైపోయింది. తెలంగాణ అనివార్యమని తేలిపోయింది. ఈ పరిస్థితుల్లోనూ ఆంధ్ర పాలకులు కుటిల ఎత్తులూ, నక్కజిత్తులూ మానలేదు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలనే వాదనను తెరమీదికి తెచ్చారు. రాష్ర్టాన్ని మూడు ముక్కలు చేయాలంటూ వితండ వాదం చేశారు. చివరికి, ఆ పప్పులేం ఉడకలేదు.
ఉద్యమం సమయంలో ఆంధ్రపాలకులు చూపిన బూచి కరెంటు! ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ చీకటిమయం అవుతుందని భయపెట్టారు. కేసీఆర్ ఆ కట్టుకథల్ని చెత్తబుట్ట పాలు చేశారు. విద్యుత్ వినియోగంలో దేశంలోనే ముందువరుసలో ఉన్నది తెలంగాణ. ఇరవై నాలుగు గంటలూ కరెంటు ఇస్తున్నది.
గుక్కెడు నీటికోసం తెలంగాణ పల్లెలు ఏడ్చాయి. తెలంగాణ పొలాలు నెర్రెలు బారాయి. చెరువులు నోళ్లు తెరిచాయి. వ్యవసాయమే జీవనాధారమైన రైతులు కన్నీటితో పొలాలు పండించిన రోజులున్నాయి. రైతుల గోడు పట్టని నాటి పాలక ప్రభుత్వాల విధానాలతో విసిగి వేసారి పోయారు. పురుగు మందులు తాగి ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందరో అన్నదాతలు. స్వరాష్ట్రం వచ్చేవరకూ మనదిఆత్మహత్యల తెలంగాణే. రాష్ట్రం సిద్ధించాక జననేత సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్రజా సంక్షేమ పథకాలు బంగారు తెలంగాణవైపు నడిపిస్తున్నాయి. ఎవుసం ఓ పండగలా మారింది. ప్రాజెక్టుల రీ డిజైనింగ్తో పంటపొలాలకు నీరు పుష్కలంగా అందుతున్నది. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. మిషన్ భగీరథతో ఇంటింటికీ సురక్షిత తాగునీరు లభిస్తున్నది. ప్రతి పల్లెకు జలకళ వచ్చింది. తెలంగాణ పల్లెల్లో ఇప్పుడు జలజల రాగం వినిపిస్తున్నది.
కొన్ని అనుకోని పరిణామాలూ తెలంగాణ ఉద్యమానికి కలిసొచ్చాయి. అప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పతనం అంచున ఉన్నది. తెలంగాణకు మొగ్గు చూపితే కనీసం ఒక ప్రాంతంలో అయినా బతికించుకోవచ్చని సోనియమ్మ ఆశ! పేలాలు ఏరుకోవడంలో పేరు గాంచిన భారతీయ జనతా పార్టీ కూడా ఎంతో కొంత లాభపడాలని చూసింది. ఇంకా ఆలస్యం చేస్తే, పరిస్థితి అదుపు తప్పుతుందని, ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారనీ ప్రధానికి నివేదిక అందింది. వీటన్నిటికి మించి కేసీఆర్ నేతృత్వంలోని ఉద్యమం మరింతగా బలపడుతున్న పరిస్థితి. ఇదీ తెలంగాణ ప్రకటన సమయానికి ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఉన్న వాతావరణం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుగు లేని నేత వైఎస్ఆర్. ఆయన మాటల్లో, చేతల్లో తెలంగాణ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపించేది. అసెంబ్లీ సాక్షిగానే ఉద్యమనేతలతో ఎకసెక్కాలు ఆడిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యమాన్ని ఎన్ని రకాలుగా బలహీన పరచాలో అన్ని రకాలుగా నీరుగార్చే ప్రయత్నం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే ‘హైదరాబాద్కు వీసాలు తీసుకొని రావాలని’ ఎద్దేవా చేశారు.
జిందాబాద్!
జిందాబాద్!!
ఉద్యమస్ఫూర్తికి జిందాబాద్!
జాగృతజాతికి జిందాబాద్!