మన ఊళ్లోనే ఉంటూ ఏం చేయగలుగుతాం? చదువుకున్న వారైతే చుట్టుపక్కల పిల్లలకు ట్యూషన్లు చెబుతారు. లేదంటే, వచ్చిన పని చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా నిలుస్తారు. అందరికీ భిన్నంగా ఆలోచించింది హిమబిందు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చుకొన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన హిమబిందు ఉడతనేని ఊరి పొలిమేరలు దాటకుండానే తన ప్రతిభను ఎల్లలు దాటిస్తున్నది. ఓవైపు, ‘బిజీ బీ’ ఆన్లైన్ లెర్నింగ్సెంటర్ నిర్వహిస్తున్నది. మరోవైపు, తెలుగువన్ రేడియో ఆర్జేగా ప్రపంచంలోని తెలుగువారిని పలకరిస్తున్నది. అంతేనా,సొంతంగా యూట్యూబ్ చానల్ స్థాపించి తన సత్తా చాటుతున్నది హిమబిందు.
కరోనా వేళ ఎందరో ఉపాధి కరువై సతమతమవుతున్నారు. లాక్డౌన్ ప్రభావంతో పల్లెదారి పట్టారు. ‘బిజీ బీ’ లెర్నింగ్ స్కూల్ నిర్వహిస్తున్న హిమబిందు కూడా, గత లాక్డౌన్ సమయంలోనే భర్తతో కలిసి ఊరికి చేరుకుంది. కావాల్సినంత తీరిక, కోరుకున్నంత ప్రశాంతత.. ఆమెను ఏదో ఒకటి చేయమని పురిగొల్పాయి. తన ‘బిజీ బీ’ లెర్నింగ్ స్కూల్ను ఆన్లైన్ శిక్షణ కేంద్రంగా మార్చేసింది. అనతికాలంలోనే తెలుగు రాష్ర్టాలే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలు దాటుకొని యూకే, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్, ఐర్లాండ్.. ఇలా పలు దేశాల పిల్లలకు 24 అంశాల్లో డిజిటల్ పాఠాలు చెబుతున్నది. హిమబిందు చొరవ 35 మంది ఆన్లైన్ బోధకులకు ఉపాధి కల్పించింది. మరోవైపు ఆర్జేగా, యూట్యూబ్ చానల్ నిర్వాహకురాలిగా తనేంటో నిరూపించుకుంటున్నది హిమబిందు. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే..
మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీర్. 2011లో మా పెండ్లయింది. ఢిల్లీలో కొత్త కాపురం. వచ్చీరాని భాష, తెలిసీ తెలియని మనుషులు. ‘ఇదేం జీవితం’ అనిపించేది. 2012లో హైదరాబాద్కు వచ్చేశాం. అప్పటికే బాబు పుట్టాడు. వాడిని వదిలి బయటికి వెళ్లలేను. ‘బుజ్జాయి ఆలనాపాలనా చూస్తూనే చేయగలిగిన పని ఏదైనా ఉందా?’ అని ఆలోచిస్తున్న సమయంలో పీపీటీసీ ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత ఓ స్కూల్లో నర్సరీ టీచర్గా చేరాను. కొన్నాళ్లకు ‘ఇంకేమైనా చేయలేనా?’ అన్న ఆలోచన వచ్చింది. ఇంట్లోనే ఉంటూ ఆర్జేగా చేయొచ్చని ఓ స్నేహితురాలు చెప్పింది. ఆర్జేగా శిక్షణ తీసుకొని, తెలుగువన్ రేడియోలో చేరాను. అప్పుడే, మహా నటి సావిత్రి కూతురిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. అది నచ్చి ఓ అజ్ఞాత శ్రోత 100 డాలర్ల చెక్కును బహుమతిగా పంపటం మరచిపోలేని సంఘటన.
మా ఆయన ప్రాజెక్టు పనిమీద ఏడాదిన్నరపాటు అమెరికాలో ఉన్నాం. మేం ఉన్న ప్రాంతంలో చాలామంది భారతీయులే. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు. పిల్లలను డే కేర్ సెంటర్స్లో ఉంచేవారు. ఏ దేశంలో అయినా ఇది మామూలే. అయితే, అక్కడి డే కేర్ సెంటర్స్ను ఎలా నిర్వహిస్తారో గమనించాను. పిల్లలతో ఎలాంటి యాక్టివిటీస్ చేయిస్తారో పరిశీలించాను. ఆ అనుభవంతో హైదరాబాద్కు వచ్చాక, స్నేహితురాలు శిరీషతో కలిసి ‘బిజీ బీ’ లెర్నింగ్ స్కూల్ ప్రారంభించాను. అప్పటికి నేను ఏడు నెలల గర్భవతిని. అయినా, చాలా కష్టపడేదాన్ని. రెండేండ్లలో రెండు శాఖలు ఏర్పాటు చేయగలిగా. ఇందులో ప్లేగ్రూప్, డే కేర్, ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్ నిర్వహించేవాళ్లం. స్కూల్ పుంజుకుంది. పెట్టుబడి చేతికొచ్చి, లాభాలు అందుకుంటున్న తరుణంలో కరోనా వచ్చింది. ఇక, ఇక్కడ ఉండటం ఎందుకనిపించింది. మా ఊరికి వెళ్లిపోయాం.
వర్క్ ఫ్రమ్ హోమ్తో మా ఆయన బిజీ. నేనేమో పూర్తిగా ఖాళీ. ఎన్నో ఆశలతో పెట్టిన ‘బిజీ బీ’ భవిష్యత్తు ఏంటి? ఇవే ఆలోచనలు. లాక్డౌన్కు ముందే మా ‘బిజీ బీ’ ద్వారా విదేశాల్లోని ఓ స్నేహితురాలికి ఆన్లైన్లో సంగీత శిక్షణ ఇప్పించాం. ఆ అనుభవంతో ‘బిజీ బీ’ని ఆన్లైన్ లెర్నింగ్ సెంటర్గా మార్చాలనుకున్నా. సంగీతం, నాట్యం, వాద్యాలు, వేదిక్ మ్యాథ్స్, క్యూబిక్ మ్యాథ్స్, యోగా, తెలుగు, హిందీ, ఇంగ్లిష్తోపాటు విదేశీ భాషలు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ వంటి సబ్జెక్టులు.. ఇలా పిల్లలకు అవసరమైనవన్నీ ఆన్లైన్లో బోధించే ఓ వేదికగా తీర్చిదిద్దాను. ప్రతి క్లాస్ 45 నిమిషాలు ఉండేలా ప్రణాళిక చేసుకున్నాం. తొందర్లోనే బాగా పుంజుకుంది. విదేశాల్లో ఉంటున్న భారతీయ చిన్నారులు మా పాఠాలు వింటున్నారు. మా దగ్గర 35 మంది ఆన్లైన్ ట్యూటర్లు పనిచేస్తున్నారు. కరోనా కాలంలో ఇంతమందికి ఉపాధి కల్పించడం గర్వంగా ఉంది.
‘మా కుటుంబాల్లో అంతా బీటెక్లు, ఎంటెక్లు చేశారు. ఇదొక్కతే డిగ్రీదాకా చదివి ఊరుకుంది’ అని అందరూ నన్ను అనేవాళ్లు. ఇప్పుడు వాళ్లే ‘మా బిందు రేడియో జాకీ, యూట్యూబ్ చానల్ నిర్వాహకురాలు, మంచి యాంకర్’ అని మెచ్చుకుంటున్నారు. నా యూట్యూబ్ చానల్ కోసం చేసే ఎపిసోడ్లను ముందుగా మా మామయ్య చూస్తాను. బాగుంటే అభినందిస్తారు. లేదంటే, తన సూచనలు చెబుతారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతోనే నేను రాణించగలుగుతున్నా. మా ఆయన కూడా నాకు అండగా ఉండటం సంతోషంగా అనిపిస్తుంది.
మాది వ్యవసాయ కుటుంబం. మేం ఇద్దరం ఆడపిల్లలం. నాన్న పేదరికాన్ని పక్కకు పెట్టి మమ్మల్ని చదువుల కోసం హైదరాబాద్ పంపారు. 2006లో నేను డిగ్రీ చేసేందుకు మా అక్కతోపాటు హైదరాబాద్ వచ్చా. అమ్మానాన్న పంపే డబ్బులు ఒక్కోసారి సరిపోయేవి కావు. చిన్నచిన్న ఖర్చుల కోసం మళ్లీ అడగాలనిపించేది కాదు. ఆ సమయంలో విద్యానగర్లోని ఐఐటీ ఫౌండేషన్ స్కూల్లో ఆరో తరగతి పిల్లలకు ఆదివారం పరీక్షలు నిర్వహించేవారు. వాటికి ఇన్విజిలేటర్గా పనిచేసేదాన్ని. అలా రూ.200 వచ్చేవి. ఆ డబ్బును అవసరాలకు వాడుకునేదాన్ని.
… వరకవుల దుర్వాసరాజు