కరోనా బారినుంచి తప్పించుకోవడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోడానికి రకరకాల కషాయాలు, సూపులు తాగుతున్నారు చాలామంది. అయితే, ఈ సూపులను మరింత ఆరోగ్యకరంగా మార్చుకునేందుకు పలు చిట్కాలు చెబుతున్నారు పోషక నిపుణులు. సాధారణంగా సూప్ చిక్కగా రావడానికి కార్న్ఫ్లోర్ వాడతారు. అయితే, కార్న్ఫ్లోర్కి బదులుగా కొబ్బరిపాలను కలుపుకొంటే మంచిదంటున్నారు. కొబ్బరిపాలద్వారా శరీరానికి కావాల్సిన మోతాదులో మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ అందుతాయి. అలాగే, ఉడకబెట్టి గ్రైండ్ చేసుకున్న టమాట, క్యారెట్ వంటి కూరగాయల గుజ్జు కలపడంవల్ల కూడా చిక్కదనం వస్తుంది. ఇలా చేయడం వల్ల కూరగాయల్లోని ఫైబర్, నూట్రియంట్స్, ప్రొటీన్స్ శరీరానికి అందుతాయి. జీడిపప్పు, బాదం పేస్ట్లా చేసి కలుపుకోవచ్చు. బాదంలో విటమిన్ ‘ఇ’, రైబోఫ్లెవిన్, కాపర్, క్యాల్షియం, ఫైబర్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి సూప్ను చిక్కగా చేయడమేకాక మంచి రుచిని, తాజాదనాన్నీ ఇస్తాయి.