ఆయన జీవనానికి వేదమే ప్రమాణం. ఆయన మాట వేద సమానం.‘వేదాల్లో అన్నీ ఉన్నాయట!’ అని వినడం వరకే తెలుసు. ఆ అన్నీ తెలిసిన అతికొద్ది మంది వేదవిద్యా పారంగతుల్లో ఒకరు ఆ మహనీయుడు. సోమయాగం నిర్వహించిన విద్వదాహితాగ్ని బ్రహ్మశ్రీ మాడుగుల (పట్లూరి) మాణిక్య సోమయాజి. వారి జీవితమంతా వేద నాదమే. వేదసారాన్ని మనసారా ఆస్వాదించి.. వేలమంది విద్యార్థులకు ధారపోసిన గురువరులు ఆయన. జీవిత చరమాంకంలో తురీయాశ్రమం స్వీకరించి బ్రహ్మానంద తీర్థ యతీంద్రులుగా మారి అదేరోజున బ్రహ్మీభూతులవడం విధి విచిత్రం. ఆ మహనీయునికి ‘చింతన’ నివాళి.
బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిమ్
ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యమ్
ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షీభూతమ్
భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి॥
వేదాలపై, భాష్యాలపై సాధికారిత కలిగిన అనంత పాండిత్యం వారి సొంతం. పండిత ప్రకాండులుగా వెలుగొందుతున్నా అహంకారం దరి చేరనివ్వని వినయశీలి మాణిక్య సోమయాజి. క్లిష్టమైన వేద రహస్యాలను అరటి పండు ఒలిచి పెట్టినంత సునాయాసంగా భాష్యంగా చెప్పగల ప్రజ్ఞ వారి సొంతం. వేలాది మంది శిష్యులను వేద కోవిదులుగా తీర్చిదిద్దారు. సోమయాజులది పండిత వంశం. రంగారెడ్డి జిల్లా పట్లూరు వారి స్వగ్రామం. ముత్తాత గంగాధర దీక్షితులు, తాత రామకృష్ణ సోమయాజి అనేక గ్రంథాలు రాశారు. పెదనాన్న నరహరి సోమయాజులు. తండ్రి పురుషోత్తమ సోమయాజి అనేక యజ్ఞాలు నిర్వహించిన వేద విద్యా పారంగతులు. వేదంలోనే కాకుండా మీమాంస, వ్యాకరణ శాస్ర్తాల్లోనూ పురుషోత్తమ సోమయాజి దిట్ట. ఈ విద్వత్కుటుంబంలో 13వ సంతానంగా జన్మించారు మాణిక్య సోమయాజి. వంశపారంపర్యమైన అవిచ్ఛిన్న వేద స్రవంతిని వారసత్వంగా స్వీకరించారు.
ఆటంకాలను అధిగమించి
‘పట్లూరి సోమయాజి’ పేరుతో ఉభయ తెలుగు రాష్ర్టాల్లోనూ వారి కీర్తి అచంచలం. అయితే, ఈ మహనీయుని జీవితం వేదమంత్రంలా సజావుగా సాగలేదు. ఎన్నో ఆటుపోట్లకు గురైంది. బాల్యంలోనే తండ్రి కన్నుమూయడంతో వారి వేదాధ్యయనంపై నీలినీడలు కమ్ముకున్నాయి. తండ్రి లేని లోటును తీర్చడానికి సోమయాజుల తల్లి జానాబాయి కంకణం కట్టుకున్నారు. భర్త మరణం కుంగదీసినా.. తన బిడ్డల చదువు కోసం ఆమె పడరాని పాట్లుపడ్డారు. అప్పటికి తెలంగాణలో వేదాధ్యాపనం చేయించే గురువులు స్వల్పంగా ఉండటం, సామాజిక వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సోమయాజిని, ఆయన అన్న నరసింహశాస్త్రిని గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా చవటపాపయ్యపాలెం అగ్రహారానికి తీసుకెళ్లారు. అక్కడ గురుకులంలో ఆమెకు ఎన్నో పరీక్షలు ఎదురయ్యాయి. నిజాం ప్రాంతానికి చెందిన వారికి ప్రవేశం లేదన్నారు గురుకుల గురువులు. అయినా పట్టుదలతో వారిని ఒప్పించి బిడ్డలను గురుకులంలో చేర్చారు. అక్కడే సంహిత వరకు అధ్యయనం చేశారు సోమయాజి. ఇంతలో వారి సోదరి అనారోగ్యంతో కన్నుమూయడంతో చదువుకు అంతరాయం ఏర్పడింది. మళ్లీ తల్లి ప్రోద్బలంతో బాపట్లలోని గొల్లపూడి మధుసూదన అవధాని దగ్గర మిగిలిన వేద భాగాన్ని పూర్తి చేశారు. తర్వాత రేపల్లెలోని తూములూరి సుబ్బావధాని దగ్గర పదం, క్రమం, బ్రాహ్మణ, ఆరణ్య భాగాలు, ఉపనిషత్తులు పూర్తి చేశారు. అప్పుడే అన్న నరసింహశాస్త్రి మరణించారు. అంతటితో విద్యాభ్యాసం మానేసి ఇంటికి వెళ్లిపోదాం అనుకున్నారు సోమయాజి. కానీ, తల్లి ప్రోత్సాహంతో వేదాధ్యయనం పూర్తి చేశారు. 17 ఏండ్ల వయసులోనే వేదశాస్త్ర సభల్లో విజయం సాధించే స్థాయికి ఎదిగారు.
సోమయాజిగా..
వేదాధ్యయనం తర్వాత స్వగ్రామానికి చేరుకున్న మాణిక్య సోమయాజి వేదవిద్య ప్రచారమే జీవన విధానంగా మార్చుకున్నారు. ఆ సమయంలోనే కర్ణాటకలోని హుమ్నాబాద్ సమీపంలోని ఖనేరంజోల్ గ్రామానికి చెందిన రామచంద్ర భట్ కుమార్తె లలితతో మాణిక్య సోమయాజుల వివాహమైంది. గృహస్థ ధర్మాలను కొనసాగిస్తూ ప్లవంగ నామ సంవత్సరంలో సోమయాగాన్ని నిర్వహించి ‘సోమయాజి’గా సార్థక కీర్తిని అందుకున్నారు. లలితమ్మ సోమిదేవమ్మగా సోమయాజికి జీవితంలోని ప్రతిఘట్టంలోనూ అండగా నిలిచారు. వారి ధార్మిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు కుమారులు పురుషోత్తమ శర్మ, సర్వోత్తమ శర్మ, కుమార్తెలు లక్ష్మీనరసమ్మ, గాయత్రి.
గురువులుగా..
సోమయాజి జీవితంలో మరపురాని ఘట్టం వేదవిద్యా నిధి శాస్ర్తుల విశ్వనాథశాస్త్రితో పరిచయం. ఆయన ప్రేరణతో ఉమ్మడి మెదక్ జిల్లా ఇస్మాయిల్ఖాన్పేటలో ప్రారంభమైన వేదవిద్యా పాఠనోద్యమంలో భాగమయ్యారు. విశ్వనాథశాస్త్రి స్వగ్రామం శివ్వంపేటలోని వేదపాఠశాలలో ఆచార్యులుగా చేరారు. దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు వందలాది మంది శిష్యులను వేదవిద్యలో, శాస్త్ర విద్యలో తీర్చిదిద్దారు. ఆయన శిష్యులు, ప్రశిష్యులు వేద వాఙ్మయప్రచారంలో తరిస్తున్నారు.
కాశీలో బ్రహ్మస్వ భవనం
మాణిక్య సోమయాజి జీవితమంతా వేద ధర్మ పరిరక్షణ దీక్షలో గడిపారు. భారత ఆధ్యాత్మిక రాజధాని.. కాశికాపురిలో దశాబ్దం పాటు ఉన్నారు. విశ్వనాథుని సన్నిధిలో తెలుగువారి కోసం ఒక ధార్మిక భవనం ఉండాలనే సంకల్పంతో తన శిష్యులు, ఔత్సాహిక ధార్మికులతో కలిసి బ్రహ్మస్వ భవనం ట్రస్ట్ నెలకొల్పారు. కాశీలో కేదార్ఘాట్ సమీపంలోని సోనార్పురాలో సువిశాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ‘బ్రహ్మస్వ భవనం- భూదాన సంకల్పం’ అని వీరిచ్చిన పిలుపు అందుకొని విశ్వవ్యాప్తంగా ఎందరో స్పందించారు. రూ.మూడు కోట్లకు పైగా విరాళాలు సమీకరించారు. వారి సంకల్ప బలంతో త్వరలోనే బ్రహ్మస్వ భవనం రూపుదిద్దుకోవాలని ఆకాంక్షిద్దాం. తెలంగాణ మాగాణంలో ప్రభవించిన మేలిమి మాణిక్యం మాణిక్య సోమయాజులు. వారి ధార్మిక జీవనం భావి తరాలకు ఆదర్శం.‘యోగేనాంతే తనుత్యజాం’ అన్నట్టుగా ఆతుర సన్యాసదీక్షతో ‘బ్రహ్మానందతీర్థ’యతిగా మారి పరబ్రహ్మలో లీనమైన మహాయోగిని సదా స్మరించుకుందాం.
అమ్మ పట్టుదలతోనే
మాణిక్య సోమయాజి వేద విద్య అభ్యసించే రోజుల్లో ఒకసారి ఆ ప్రాంతమంతా కలరా ప్రబలింది. ఇంటి మీదికి మనసు మళ్లింది. తల్లి తోడు కావాలనిపించింది. అదే విషయం తల్లికి చెప్పారాయన. అప్పుడామె ‘నాయనా! వేదాధ్యయనం చేయని నా కొడుకు ఉన్నా లేనట్టే. వేదాభ్యాసంలో నా కొడుకు పోయినా ఉన్నట్టే’ అని ప్రత్యుత్తరం ఇచ్చింది. తల్లి వాక్కును శిరోధార్యంగా భావించారు సోమయాజి. నాటి నుంచి ఏ పరిస్థితులు ఎదురైనా విద్యాభ్యాసం కొనసాగించారు. ‘నా పాండిత్యం అంతా అమ్మ అనుగ్రహమే! వేదాధ్యయనం కోసం నన్ను, మా అన్నను తీసుకొని ఆంధ్రదేశం వెళ్లింది అమ్మ. ఆ సమయంలో రజాకార్ల దురాగతాలు జరుగుతున్నా లక్ష్యపెట్టలేదు. గుంటూరు జిల్లా చవటపాపయ్యపాలెం అగ్రహారానికి తీసుకెళ్లింది. అయితే అక్కడ నైజాం ప్రాంతం వారికి ప్రవేశం లేదన్నారు. కానీ, మా అమ్మ ఎన్నో ధర్మసూక్ష్మాలు, సోమయాగం, ఇష్టి గురించి అక్కడి గురువులతో చర్చించింది. అమ్మకున్న అవగాహన తెలిసి వాళ్లూ ఆశ్చర్యపోయారు. తన పట్టుదలకు ముగ్ధులయ్యారు. ‘ఒక మహిళ దేశం కాని దేశం వచ్చి వేదాధ్యయనం కోసం అర్థించినప్పుడు, ప్రాంతీయ భేదాలను పక్కన పెట్టకపోతే వేదమాతను అవమానించిన వారమవుతామ’ని
సమ్మతించారు. అలా పాఠశాలలో ప్రవేశం కలిగింది. నా వేద విద్య మా అమ్మ పట్టుదల పెట్టిన భిక్ష’ అని ఒక సందర్భంలో గుర్తు చేసుకున్నారు మాణిక్య సోమయాజి.
వరించిన పురస్కారాలెన్నో..
వైదిక సేవలకే జీవితాన్ని అంకితం చేసిన సోమయాజులును ఎన్నో పురస్కారాలు వరించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ఆయుత చండీయాగంలో స్వర్ణ కంకణం తొడిగి ఘనంగా సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణ వేడుకల్లో విశిష్ట పండిత సత్కారం పొందారు. ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన సహస్ర చండీయాగం వీరి వైదిక ఆధ్వర్యంలో జరిగింది. గోదావరి పుష్కరాల సందర్భంగా ధర్మపురిలో ‘మహాగ్ని చయన పూర్వక జ్యోతిరప్తోర్యామయాగం’ నిర్వహించారు సోమయాజి. దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాస పత్రిక ఆధ్వర్యంలో వారికి ధార్మికవరేణ్య బిరుదుతోపాటు జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. ప్రతిష్ఠాత్మక ధార్మిక సంస్థల నుంచి ‘వైదిక శిరోమణి’, ‘వేదవిద్వన్ మూర్తి’, ‘వేద విద్వన్మణి’ తదితర బిరుదులు అందుకున్నారు.
మరుమాముల దత్తాత్రేయ శర్మ
9441039146