“జగన్నాథః స్వామీ నయన పథగామీ భవతు మే”‘శ్రీజగన్నాథస్వామి దయతో నాకు దర్శన మొసగుగాక’ అని కీర్తిస్తూ భక్తులు శ్రీజగన్నాథుడు, ఆయన సోదరుడైన బలభద్రుడు, సోదరియైన సుభద్రను వేర్వేరు రథాలలో ఆసీనులను చేసి ఊరేగింపుగా తీసుకొని వెళ్లడమే ‘శ్రీజగన్నాథ రథయాత్ర’ మహోత్సవం.
శ్రీజగన్నాథ రథయాత్ర ఆషాఢశుద్ధ విదియరోజు వస్తుంది. ప్రతీ రథయాత్రలో ‘శ్రీజగన్నాథ-బలదేవ-సుభద్ర’లకు కొత్తకొత్త రథాలు వాడుతారు. వాటి తయారీకి కావలసిన కలపను ‘వసంతపంచమి’ నుండే సమకూర్చడం మొదలు పెట్టి సరిగ్గా ‘అక్షయ తృతీయ’ రోజు రథాల తయారీ ప్రారంభిస్తారు. అదే ‘చందనోత్సవం’ మొదలయ్యే రోజు.
శ్రీజగన్నాథ మందిరానికి ఎదురుగా ఉన్న గ్రాండ్రోడ్డుపైనే రెండు నెలల్లో మూడు రథాలను తయారుచేస్తారు. ఏటేటా కించిత్తయినా మార్పు లేకుం డా వాటిని నిర్మించడం విశేషం. శ్రీజగన్నాథుడు ప్రయాణించే రథం పేరు ‘నంది ఘోష’, శ్రీబలరాముడు నెలకొనే రథం పేరు ‘తాళధ్వజ’, సుభద్ర ఆసీనురాలయ్యే రథం పేరు ‘దేవ దళన’ లేదా ‘దేవీ రథం’.
స్నానయాత్రతో మొదలు
స్నానయాత్ర (విశేష అభిషేక ఉత్సవం) తర్వాత 15 రోజుల అనవసర కాలం పూర్తి కాగానే ‘శ్రీజగన్నాథ- బలదేవ- సుభద్ర’లు నవయౌవన వేషంలో రథయాత్రకు బయలు దేరుతారు. జనులకు దర్శనం లభించని ఆ 15 రోజుల కాలాన్ని ‘అనవసర కాలమని’ అందరూ అంటున్నప్పటికీ అది భగవంతునికి ‘ఏకాంత సమయం’. ఆ వేళ దేవదేవుడు తన దేవేరి అయిన లక్ష్మీదేవితో స్వకీయ రసాస్వాదనలో కాలం గడుపుతాడు. తర్వాత రథయాత్రలో పాల్గొనడానికి ఆమె అనుమతిని తీసుకొని బయలుదేరుతాడు.
‘శ్రీజగన్నాథ- బలదేవ- సుభద్ర’లతోపాటుగా ‘సుదర్శన చక్రం’ కూడా రథయాత్రలో పాల్గొంటుంది. ‘రథయాత్ర ఉత్సవం’ ఆలయం నుండి ‘గుండిచ’ మందిరం వరకు కొనసాగుతుంది. అందులో మొదట ‘శ్రీబలదేవుని రథం’ ప్రయాణిస్తుంది. తర్వాత ‘సుభద్ర రథం’ వెళుతుంది. వారిద్దరి రథాల వెనుక ‘శ్రీజగన్నాథుడు’ బయలుదేరుతాడు. ‘గుండిచ’ మందిరం వరకు ఉన్న సుమారు 2 కి.మీ. దూరాన్ని రథాలు సాయంత్రం లోపల చేరుకుంటాయి.
మళ్లీ తిరిగి రాలేదు కనుక..
శ్రీకృష్ణుడు బృందావన వాసులకు ప్రాణం వంటివాడు. బృందావన వాసులలో ముఖ్యంగా రాధారాణికి అంతర్బహిర్ ప్రాణం నందనందనుడే. కంసుని వధించాలనే నెపంతో శ్రీకృష్ణుడు బలరామునితోపాటుగా మథురకు వెళ్లగానే బృందావన వాసులందరు దాదాపుగా ప్రాణరహితులయ్యారు. ‘మళ్లీ తిరిగి వస్తాను’ అని శ్రీకృష్ణుడు పలికిన మాటను గుర్తు పెట్టుకొని వారు కొన ఊపిరితో జీవించారు. ఆ విధంగా వెళ్లిన గోపాలుడు మళ్లీ తిరిగి రాలేదు.
ఈ నేపథ్యంలోనే ఒకసారి బృందావన వాసులు రాధారాణి నేతృత్వంలో ‘శ్రీకృష్ణ బలరామ సుభద్ర’లను రథంలో కూర్చోపెట్టి తిరిగి బృందావనానికి తీసుకొనిపోయే భావంలో మునిగారు. శ్రీజగన్నాథ ఆలయం ద్వారకను సూచిస్తే, గుండిచ మందిరం బృందావనాన్ని సూచిస్తుంది.
మాధుర్య రస భావన
శ్రీజగన్నాథ రథయాత్ర సామాన్యజనులకు పరమ పుణ్యదాయకం, ముక్తిదాయకం. ఎందరో భక్తులకు మాత్రం ప్రేమదాయకమైంది కూడా. దుఃఖపూర్ణమైన జగత్తును విడిచి భగవద్ధామానికి వెళ్లడానికి కావలసిన ఏకైక యోగ్యత శ్రీకృష్ణునితో సంబంధం. ఇక, అటువంటి సంబంధాలలో అత్యున్నతమైంది ‘మధుర రస భావన’. 500 సంవత్సరాల కిందట ఆవిర్భవించిన శ్రీచైతన్య మహాప్రభువు ఈ ‘మాధుర్య రస భావాన్ని’ రథయాత్రలో ప్రదర్శించారు. ఆ విధంగా శ్రీచైతన్యుల కాలంలో రథయాత్ర భావపూర్ణంగా సాగేది. అప్పటినుండి భక్తులందరు మధుర భావభక్తిలో మమేకమై రథయాత్రను కొనసాగిస్తున్నారు.
డా॥ వైష్ణవాంఘ్రి సేవక దాస్
98219 14642