ఓ చెట్టు మొయినాబాద్ రోడ్డు పక్క నుంచి వచ్చింది. మరో వృక్షం సముద్రాలు దాటుకొని వచ్చింది. పక్క రాష్ర్టాల నుంచి కొన్ని, పరాయి దేశాల నుంచి కొన్ని.. ఇలా రకరకాల ప్రాంతాల మానులన్నీ ఓ వృక్ష ప్రేమికుడి పిలుపునకు స్పందించి.. బిరబిరా తరలివచ్చాయి. శ్రావణ ముత్తయిదువుల్లా రామ్దేవ్ రావు‘బొటానికల్ గార్డెన్’లో కొలువుదీరాయి.
గ్రీన్ కింగ్డమ్లో అరుదైన చెట్లు అనేకం దర్శనమిస్తాయి. శతాబ్దాల నాటి కురు వృక్షాలు, దశాబ్దాలకు ఒకసారి చిగురించే చెట్లు.. ఇలా అడుగడుగుకో కథ! 70 ఏండ్లకు ఒకసారి పూత పూసే ‘సీ షెల్స్ ఫామ్ ట్రీ’ని ఇక్కడ చూడవచ్చు. ఏడు దశాబ్దాలకు ఈ చెట్టు పూతకు వస్తుంది. పూత పిందెగా మొలిచి, పండుగా మారి, విత్తనం రావాలంటే మరో తొమ్మిదేండ్లు పడుతుంది. విత్తనం బరువే 45 కిలోలు ఉంటుంది. ఈ సీడ్ ఎగుమతిపై ఆంక్షలు కూడా ఉన్నాయి. పట్టువదలకుండా ఐదు విత్తనాలను తెప్పించి నాటారు రామ్దేవ్. నాలుగు మొక్కలు బాగా పెరుగుతున్నాయి. పదిహేను వందల ఏండ్లనాటి కల్పవృక్షం ఇక్కడుంది. ఇలాంటి చెట్లు దేశంలో 15 మాత్రమే ఉన్నాయి. అందులో నాలుగు గ్రీన్ కింగ్డమ్ గార్డెన్లోనే ఉండటం విశేషం.‘కొకలో స్పెర్మమ్’ అనే అరుదైన చెట్లు ఉన్నాయిక్కడ. వేసవిలో రెండు నెలలపాటు ఈ చెట్టు ఆకులన్నీ రాలిపోతాయి. ఆ సమయంలో అందమైన పూలతో చూడముచ్చటగా కనిపిస్తుంది. ఈ రకం చెట్లు రెండు వేలకుపైగా కొలువుదీరాయి.
ఒంపులు తిరిగిన మహావృక్షాలు, గుమ్మటాల్లా ఎదిగిన చెట్లు, కుచ్చుటోపీలు పెట్టుకున్న వామన జాతులతో కళకళలాడుతూ కనిపిస్తుంది.. ‘గ్రీన్ కింగ్డమ్ గార్డెన్’. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన రామ్దేవ్ రావు కృషి ఫలితమే ఈ ఉద్యాన ‘ప్రపంచం’. చిలుకూరు-మొయినాబాద్ ప్రాంతంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఈ వృక్ష ప్రపంచాన్ని తీర్చిదిద్దారాయన. ఇక్కడ ప్రతి మొక్కకూ ఓ కథ ఉంది. తమ కోసం ఓ సామ్రాజ్యాన్నే నిర్మించిన రామ్దేవ్ రావు సంకల్పానికి ఆ హరిత జగత్తు జయజయ ధ్వానాలు చేస్తున్నది.
ఆకృతి దాల్చిన ప్రకృతి
‘చదువు పూర్తయ్యాక వ్యాపారంలో దిగాను. యూకేలో మూడు, యూఎస్లో మూడు పరిశ్రమలు స్థాపించాను. తరచూ విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఎక్కడికి వెళ్లినా, సగం సమయం వ్యాపార వ్యవహారాల గురించి ఆలోచిస్తూనే.. మిగతా సగం సమయాన్ని ఆ ప్రాంతంలోని ప్రత్యేక మొక్కలపై అధ్యయనానికి కేటాయించేవాడిని. వాటినెలా పెంచాలో తెలుసుకునేవాణ్ని. కొన్నాళ్లకు సొంతంగా బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. అనుమతి కోసం 2010 నుంచి 2012 వరకూ శ్రమించాను. అప్పటి కేంద్ర మంత్రి శరద్పవార్ను, ఇతర ప్రముఖులను కలిశాను. ఎన్నో ఇబ్బందులను అధిగమించాక బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు లైసెన్స్ వచ్చింది’ అంటూ గతాన్ని నెమరేసుకుంటారు రామ్దేవ్. సాధారణంగా, బొటానికల్ గార్డెన్లో రకరకాల మొక్కలు ఉంటాయి. కానీ, రామ్దేవ్ ‘గ్రీన్ కింగ్డమ్ గార్డెన్’కు అంతకుమించిన ప్రత్యేకత ఉంది. స్వతహాగా ఆర్టిస్ట్ కూడా కావడంతో తోటలోని వృక్షాలను కళాత్మకంగా తీర్చిదిద్దారు. గ్రీన్ కింగ్డమ్ గార్డెన్, యునీక్ ట్రీ నర్సరీలకు పరిపూర్ణ రూపం వచ్చేందుకు ఏడాదిన్నరకు పైగా పడుతుంది.
కళల వనం
గార్డెన్లో చెట్ల మధ్యలో వివిధ శిలాకృతులను ఏర్పాటు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు రామ్దేవ్. స్టోన్, సెరామిక్, స్టెయిన్ లెస్ స్టీల్, ఇత్తడి ముడిసరుకుగా అనేక ఆకృతులను ప్రతిష్ఠిస్తున్నారు. వీటి తయారీ కోసం ప్రత్యేకంగా ఓ పరిశ్రమను నెలకొల్పారు. ఖరీదైన యంత్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొన్నారు.
85 దేశాల చెట్లు
గ్రీన్ కింగ్డమ్లో అడుగడుగునా అరుదైన వృక్షాలు పలుకరిస్తాయి. మూడువేల ఏండ్ల నాటి పురాతన తరువులు, వందల ఏండ్ల నాటి మహావృక్షాలు దర్శనమిస్తాయి. ‘నిజానికి, మా పొలం చదునుగా ఉండేది. కానీ, వృక్షాలు అందరినీ ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మట్టి గుట్టలు ఏర్పాటు చేయించాను. ఇందుకోసం రూ.18 కోట్లు వెచ్చించాను. మొత్తం 150 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో 30 ఎకరాల్లో రిసార్ట్స్, 120 ఎకరాల్లో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేశాం’ అని వివరిస్తారు రామ్దేవ్. ఈ గార్డెన్లో 85 దేశాలకు చెందిన వందలాది చెట్లు దర్శనమిస్తాయి. ప్రత్యేక కంటెయినర్ల ద్వారా వీటిని ఇక్కడికి తరలించారు. ఇప్పటి వరకు 35 శాతం పని జరిగింది. మరో 65 శాతం త్వరలోనే పూర్తవుతుంది. ఆ తర్వాత, హరిత ప్రియులకు ఇదో యాత్రాస్థలి.
ప్రాణం పోసి..
రహదారుల విస్తరణలోఎన్నో చెట్లు నేలకూలుతుంటాయి. అలాంటివాటికి పునః ప్రాణప్రతిష్ఠ చేస్తారు రామ్దేవ్. ‘ట్రాన్స్లొకేషన్’ ద్వారా చెట్లను గ్రీన్ కింగ్డమ్కు తరలిస్తున్నారు. పన్నెండేండ్ల కిందట శంకర్పల్లి, మొయినాబాద్ రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన 150 ఏండ్లనాటి మర్రిచెట్లను తీసుకువచ్చి మళ్లీ చిగురింపజేశారు. అలానే, మరో 220 చెట్లనూ కాపాడారు. విజయవాడ రోడ్డు విస్తరణ సమయంలో రూ.6 కోట్లు వెచ్చించి దాదాపు 600 వృక్షాలను రక్షించారు. కుటుంబ సభ్యుల సహకారమే లేకుంటే.. ఈ వృక్ష యజ్ఞం కొనసాగేది కాదంటారు ఆయన. ‘చెట్లపై నాకున్న ప్రేమను మావాళ్లు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా నా శ్రీమతి శ్రీలక్ష్మి, కూతురు రిన్విత, బాబు విన్విద్ ఈ గార్డెన్ను తీర్చిదిద్దడం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది’ అని చెబుతారు రామ్దేవ్.
రామ్దేవ్.. ఫైన్ ఆర్ట్స్ చదివారు. వ్యాపారవేత్తగా రాణిస్తూనే వృక్ష రక్షణకు కంకణం కట్టుకున్నారు. వ్యయప్రయాసలకోర్చి కలప వృక్షాలను కళాత్మక తరువులుగా మారుస్తున్నారు. రామ్దేవ్ తండ్రి నారాయణరావు అటవీశాఖలో కాంట్రాక్టర్. దీంతో బాల్యం నుంచీ తండ్రితో కలిసి అడవులకు వెళ్లేవారు. అలా చెట్లతో విడదీయరాని బంధం ఏర్పడింది. పచ్చదనాన్ని చూస్తే చాలు పరవశించేవారు. రెండడుగుల ఖాళీ నేల కనిపించినా నాలుగు మొక్కలు నాటేవారు. విద్యార్థి దశలో హాస్టల్ గది నిండా పూలమొక్కలు పెంచుకుని మురిసిపోయేవారు. మొక్కలపై ఆ మక్కువ వయసుతో పాటు పెరుగుతూ వచ్చింది.
… వరకవుల దుర్వాసరాజు