చైనా సరిహద్దు అంటేనే సున్నిత ప్రాంతం. శత్రుసేనల కండ్లన్నీ ఇటువైపే. ఈ పరిస్థితుల్లో ‘బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్’ (బీఆర్వో) చైనా-ఇండియా బోర్డర్లో రహదారులను మెరుగు పరిచే బాధ్యతను మహిళా కమాండింగ్ ఆఫీసర్ అయిన వైశాలి హివేజ్కు అప్పగించింది. మహారాష్ర్టకు చెందిన వైశాలి వార్దాలో పుట్టి పెరిగింది. ఎంటెక్ చేసింది. బోర్డర్ రోడ్ కన్స్ట్రక్షన్ విభాగంలో సేవలందిస్తున్నది. కార్గిల్ ప్రాంతంలో రహదారుల నిర్మాణ సమయంలో వైశాలి సేవలను గుర్తించిన ప్రభుత్వం ఈ కీలక బాధ్యతనూ ఆమెకే అప్పగించింది. లోయలు, పర్వతాలతో కూడిన ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చాలా కష్టమైన పని. అయినా, ధైర్యంగా సవాలును స్వీకరించింది వైశాలి. ఇంత కీలక బాధ్యతను చేపట్టిన తొలి మహిళా కమాండింగ్ ఆఫీసర్ తనే.