ఉదయాన్నే ఫలహారం చాలా ముఖ్యం. అయినా ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తుంటారు. రోజువారీ పనుల్లో చురుగ్గా ఉండాలన్నా, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా పోషకాలతో నిండిన అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి. రోజూ వండుకోవడం కష్టంగా అనిపిస్తే, త్వరగా అయ్యే ఆరోగ్యకర బ్రేక్ఫాస్ట్ను ఎంచుకోవాలి.
గుడ్లు : వీటిలో అపారమైన పోషకాలు ఉంటాయి. ల్యుటీన్, జియెక్సాథిన్ పుష్కలంగా లభిస్తాయి. ఒక గుడ్డులో ఏడు గ్రాముల నాణ్యమైన ప్రొటీన్, 75 క్యాలరీలు ఉంటాయి. ఉడికించిన గుడ్లు బోర్ అనిపిస్తే, కూరగాయలు కలిపి ఆమ్లెట్ వేసుకోవచ్చు.
ఓట్స్ : ఇందులో కొవ్వుశాతం తక్కువ. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఓట్స్లోని ఫైబర్ ఎక్కువసేపు కడుపును నిండుగా ఉంచుతుంది. ఓట్స్తో దోశలు, ఇడ్లీలు, ఊతప్పం చేసుకోవచ్చు. అంత సమయం లేదనుకుంటే, రాత్రిపూట పాలు లేదా నీళ్లలో నానబెట్టాలి. తెల్లారాక పండ్ల ముక్కలు, తేనె కలుపుకొని హాయిగా తినొచ్చు.
పండ్లు – పెరుగు : పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోబయాటిక్ ఫైబర్స్, పాలీఫెనాల్స్ ఉంటాయి. అలాగే, పెరుగులో ప్రొటీన్ పుష్కలం. అంతేకాదు పెరుగు పులిసిన పదార్థం కావడంవల్ల పాలకంటే కూడా ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఇలా పెరుగులో పండ్ల ముక్కలు లేదా రసం కలుపుకొని తినవచ్చు. అదనంగా చియా గింజలో అవిసె గింజలో జోడించుకోవచ్చు.