ఇన్ని రోజులూ నాలుగు గోడలమధ్య చాలామందికి ఊపిరాడలేదు. ఇప్పుడిప్పుడే జనం ఫ్యామిలీతో పిక్నిక్లు, టూర్లు ప్లాన్ చేస్తున్నారు. అయితే, కరోనా వైరస్ పూర్తిగా అంతం కాలేదని గుర్తు పెట్టుకోవాలి. అడపాదడపా కేసులు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ట్రిప్ పూర్తి చేసుకోవాలి. పద్దెనిమిది నిండినవాళ్లు అయితే, వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే. కుటుంబ సభ్యులంతా, టూర్కు రెండు రోజుల ముందే కొవిడ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది. ప్రయాణ సమయాల్లో కూడా డబుల్ మాస్క్ ధరించాలి. ఫేస్షీల్డ్ బెస్ట్ ఆప్షన్. టూర్లలో సర్జికల్ లేదా ఎన్95 మాస్కులు వాడటం సౌకర్యంగా ఉంటుంది. హ్యాండ్వాష్ అందుబాటులో ఉన్న ప్రతిచోటా చేతులను శుభ్రం చేసుకోవాలి. మిగిలిన సమయాల్లో శానిటైజర్ ఉపయోగించాలి. యాత్రా స్థలాల్లో జనం గుమిగూడిన చోటికి వెళ్లకపోవడమే ఉత్తమం. కొవిడ్ కేసుల్లేని ప్రాంతాలకే ప్లాన్ చేసుకోవాలి. ఇంకొన్ని రోజులు వాయిదా వేసుకుంటే ఇంకా మేలు.