నలుగురి గురించి ఆలోచించడానికి పెద్ద మనసు ఉండాలి. అందుకు ఈ పెద్దమ్మే నిదర్శనం. 82 ఏండ్ల లక్ష్మీ నర్సమ్మ జీవితంలోని ప్రతి పేజీలో త్యాగం కనిపిస్తుంది. ప్రతి మలుపులోనూ పరోపకారం ప్రతిఫలిస్తుంది. మలి సంధ్యలో కూడా సేవాపథంలో నడుస్తూ పదిమందికీ‘దిశా’ నిర్దేశం చేస్తున్న బిరుదురాజు లక్ష్మీ నర్సమ్మ ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలు..
ఖాళీగా కూర్చోవడం అంటే తెలియదు నాకు. ఎనిమిది పదుల వయసు దాటినా ఇప్పటికీ ఏదో ఓ పని చేస్తూనే ఉంటాను. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ‘ఈ జీవితం ఎన్ని అనుభవాలను ఇచ్చిందో’ అనిపిస్తుంది. పెద్ద బాలశిక్ష చదువు నాది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పెద్దకొంగర మా ఊరు. పదమూడేండ్లకే పెండ్లి చేశారు. మా ఆయన రాఘవరాజుకు హైదరాబాద్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. దాంతో మేం సిటీకి వచ్చేశాం. మా అమ్మమ్మ, తాతయ్య అంబర్పేటలో ఉండేవాళ్లు. మేమూ అక్కడే ఉండేవాళ్లం. అమ్మమ్మ ఇరుగు పొరుగు పిల్లలకు పాఠాలు చెప్పేది. నేనూ అక్షరాలు నేర్పించేదాన్ని. అలా చదువు చెప్పడం అలవాటైంది.
మా ఊరినుంచి ఎవరు ఏ అవసరానికి హైదరాబాద్కు వచ్చినా మా ఇంట్లోనే ఉండేవాళ్లు. ఎవరికైనా సుస్తి చేస్తే ఉస్మానియాకు తెచ్చేటోళ్లు. రోగి బంధువులు మా ఇంట్లో ఉండేవాళ్లు. వాళ్లకు వంట, రోగికి క్యారేజ్ కట్టుడు అన్నీ చేస్తుండేదాన్ని. ఎందరికి పెట్టినా అస్సలు ఇబ్బంది అనిపించేది కాదు. ఆ రోజుల్లో మనవాళ్లు అనే భావన బలంగా ఉండేది. అంతేకాదు, నాకు కొంచెం ఆయుర్వేదంపై అవగాహన ఉంది. మా ఊరోళ్లకు ఏదైనా సమస్య వస్తే మందులు ఇచ్చేదాన్ని. ఇప్పటికీ నా కొడుకుతోటి సామాన్లు తెప్పించి కొన్ని రకాల మందులు తయారు చేస్తుంటాను.
మా ఆయన అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుగారికి గన్మన్గా కొన్నాళ్లు ఉన్నాడు. అలా మేం చాలా ఏండ్లు ఆయన పార్టీకి పని చేసినం. తర్వాత లక్ష్మీపార్వతితో కలిసి ప్రజల్లో తిరిగా. ఉన్నంతలో నలుగురికి సాయం చేసేదాన్ని. మా ఆయన కూడా నాలాగే! ఏడాదిన్నర కిందట నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు నా వయసు 82 ఏండ్లు. చిన్న కొడుకు రాజుతో ఉంటున్నా. నాకు నెలకు రూ.17 వేల పెన్షన్ వస్తది. అందులో ఏడు వేలు నా కోసం తీసుకుంటా. ఏడాది కిందట మా అబ్బాయితో కలిసి ‘దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్’ స్థాపించా. నా పెన్షన్లో మిగిలిన పదివేల రూపాయలూ దిశ ఫౌండేషన్ద్వారా కష్టాల్లో ఉన్నవాళ్లకు సాయంగా అందిస్తున్నాం. నాకు పుస్తకాలంటే మొదట్నించీ ఇష్టం. రామాయణం, మహాభారతం అంటే ఆసక్తి. దేవుడి స్తోత్రాలు, జ్యోతిష పుస్తకాలు చదువుతాను. పూజ చేసుకోవడం, కొద్దిసేపు పుస్తకాలు చదవడం, టీవీ చూడటం నా దినచర్య. అలాగే, దిశ సంస్థ గురించి మా అబ్బాయితో చర్చిస్తుంటాను. జాతీయ కార్యదర్శిగా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటాను.
మా ఆయన రిటైర్ అయిన తర్వాత ఇద్దరం ఉప్పలపాడుకు వెళ్లిపోయి రేషన్షాపు పెట్టాం. ఇప్పుడంటే ఆదాయం బాగానే వస్తుందని ‘నాకు కావాలి, నాకు కావాలి’ అంటూ టెండర్లు వేసి మరీ రేషన్ షాపులు నడుపుతున్నారు. కానీ, అప్పట్లో ప్రభుత్వ రేషన్ దుకాణం నడపడానికి ఎవరూ ముందుకొచ్చేవాళ్లు కాదు. అప్పటికే నలుగురు పిల్లల పెండ్లిళ్లయ్యాయి. దాంతో మా గ్రామంలో 1992 నుంచి 2002 వరకు రేషన్ షాప్ నిర్వహించాం. ఊళ్లోని ప్రతి ఒక్కరికీ ప్రతి నెలా రేషన్ అందేలా చూశాం. దాంతో మా ఊళ్లో ఇప్పటికీ మేమన్నా,
మా పిల్లలన్నా అందరికీ గౌరవం.
మరొకరికి సాయం చేయాలన్న నా గుణమే మా చిన్నబ్బాయికి వచ్చింది. అందుకే, మేమిద్దం కలిసి ‘దిశ ఫౌండేషన్’ ప్రారంభించాం. దీనికి నేను జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. మా సంస్థలో 500 మంది మహిళా సభ్యులు ఉన్నారు. టీనేజీ విద్యార్థినుల నుంచి నా వయసువాళ్ల వరకూ ఎందరో. అందరి ఉద్దేశ్యం ఒకటే, లేనివారికి అండగా ఉండటం. హైదరాబాద్తోపాటు తెలుగు రాష్ర్టాల్లోని అన్ని జిల్లాల్లో సంస్థద్వారా సేవలు అందిస్తున్నాం. బెంగళూరు, పుణె, రాంచీల్లోనూ మా సభ్యులున్నారు. వృద్ధాశ్రమాల్లో అవసరమైన వాళ్లకు మందులు, నడుము బెల్టులు, అనాథాశ్రమంలోని పిల్లలకు స్కూల్ బ్యాగులు, స్టేషనరీ వంటివి ఇప్పించాం. ఈ లాక్డౌన్ కాలంలో నిరుపేదలకు నిత్యావసరాలు సమకూరుస్తున్నాం. కొవిడ్ బాధితులకు రెండుపూటలా పోషకాహారం అందిస్తున్నాం.
–నిఖిత నెల్లుట్ల