అమ్మమ్మ దగ్గర అపార నిధి ఉంది. అమ్మ కొంత సేకరించింది. అన్న కొంత సేకరించిండు. ఆ ముగ్గురి దగ్గరా జానపదాలను సేకరించి సంపదలా కూడబెట్టింది. పాలమూరు పాటల వృక్షానికి కొమ్మగా ఎదగడమేకాక, మరో మొక్కగానూ ఒదిగింది రోజా రమణి.
‘వందేమాతరం’ నుంచి మొదలైన ఆమె ప్రస్థానం వందలాది జానపదాలు పాడేదాకా వెళ్లింది. పాఠశాలనాటి కల యూనివర్సిటీలో నిజమైంది. పట్నంలో పాటల ప్రోగ్రామ్కు ఎంపికైనా తొవ్వ కిరాయికి పైసల్లేక పరేషానైంది. అయినా, పాటను ఆపలేదు. పాలమూరు నుంచి పట్నం చేరిన రోజా రమణి పాట ప్రపంచమంతా మార్మోగింది. ‘నిమ్మలు కొట్టేరో.. రగావోనందాన’ అంటూ రమణీయ రాగాలు తీస్తున్న రోజా రమణి పాట ముచ్చట ఈవారం.
మాది వనపర్తి జిల్లా పానగల్లు మండలం బండపల్లి. ఆరేడేండ్లు ఉన్నప్పటినుంచే పాటలు పాడేదాన్ని. నాది మూడు తరాల పాట. మా అమ్మమ్మ శంకరమ్మనుంచి మా అమ్మ ఉషాణమ్మ నేర్చుకున్నది. అమ్మనుంచి నేను నేర్చుకున్నా. మా అన్న తేజవర్ధన్ నాయుడుకూడా పాటగాడే. మా తాత భజన పాటలు, భక్తిపాటలు పాడేవాడు. నేను అమ్మతో కలిసి పొలం పనికి వెళ్లేదాన్ని. చేను చెలకలల్లో అమ్మలక్కలు పాడుతుంటే వినేదాన్ని. నాకు బాగా నచ్చిన పాటల్ని మదిలో దాచి పెట్టుకునేదాన్ని. అలా నేర్చుకున్నవే ఇప్పుడు పాడుతున్నా. నా గొంతు బాగుంటుందని మొదట గుర్తించింది మా టీచర్ త్యాగయ్య సార్. ఫస్ట్ క్లాస్నుంచి పదో తరగతి వరకు ‘వందేమాతరం’ నాతోనే పాడించిండ్రు.
నేనప్పుడు ఇంటర్ చదువుతున్నా. మా ఊరి పక్కన సింగోటంలో శివలింగమన్న ఉంటడు. అన్న ఒకసారి కాలేజీలో కబడ్డీ పోటీల బహుమతి ప్రదానోత్సవానికి వచ్చిండు. మా అన్న, నేను ఈ కార్యక్రమంలో పాట పాడినం. ‘అరే.. ఇంత మంచిగ పాడుతుండ్రు. ఏ ఊరు వీళ్లది?’ అని మా గురించి తెలుసుకున్నడు. ‘ఇద్దరిదీ చాలా చక్కని గొంతు. మంచి భవిష్యత్ ఉంటది’ అని చెప్పిండు. ఒకట్రెండు రోజులకే అన్ననుంచి పిలుపొచ్చింది. ‘చెల్లె.. మా టీవీలో రేలారే రేలా మూడో దరువుకు సెలక్షన్స్ జరుగుతున్నయి. అన్నా, నువ్వూ వచ్చేయుండ్రి’ అని పిలిపించిండు. అదే రోజు సెలక్షన్స్ పెట్టిండ్రు. ఇద్దరమూ సెలక్టయినం. ‘ఇద్దరికీ ఇద్దరం పోతే ఎట్లా? నేను ఇంకో దరువులో అయినా వస్తా. నువ్వయితే వెళ్లు’ అని అన్న డ్రాప్ అయి నన్ను పంపించిండు. అన్నట్లుగానే ఐదో దరువుకు సెలక్ట్ అయ్యిండు అన్న.
‘పాటలు పాడాలని అంటున్నరు, అందునా టీవీలో అంటున్నరు. మంచిగనే ఉందిగానీ ఎట్ల పోవాలె? అప్పటిదాక హైదరాబాద్ చూసే అదృష్టం కూడా దక్కలేదు. అవకాశం వచ్చినందుకు సంతోషించాల్నా? కనీసం తొవ్వ కిరాయిల మందం కూడా పైసల్లేనందుకు బాధ పడాల్నా?’ అనే నా చింతంతా. నాకు చిన్నప్పటి నుంచి జానపదం అంటే ఇష్టం. ‘తప్పకుండా పోవాలె, టాలెంట్ నిరూపించుకోవాలె’ అని మొత్తానికైతే వెళ్లిన. నాతోపాటు అమ్మ వచ్చింది. అమ్మే నా పాటకు మూలం. ఆమె ఇచ్చిన పాటలే నన్ను ‘రేలారే’ దాకా తీసుకెళ్లినయి. రిహార్సల్స్నుంచి ఫైనల్స్వరకు పాలమూరు పాట పరిమళం వెదజల్లిన. మొత్తానికి సెకండ్ విన్నర్గా నిలిచిన. గోరటి వెంకన్న, సుద్దాల సార్, ఉదయ భానక్క చాలా ప్రోత్సహించిండ్రు.
పెద్దగా స్టేజీ కార్యక్రమాలు చేయలేదు. ఆర్కెస్ట్రా అంటే కూడా తెలియదు. ఫస్ట్ రోజు వేదిక ఎక్కిన. ఎలా పాడుతానో ఏమో అనుకున్నా. కాకపోతే చిన్నప్పటినుంచి నాకు ఉన్న తెగువేందంటే, కాదు అనే పనికోసమే ప్రయత్నం చేస్తుంటా. అట్లా ‘గొబ్బిల్లా గొర్రెల మందా నేరేడు వనమే గొబ్బిలా..’ పాట పాడిన. అదిరిపోయింది. నాతో కాంపిటీషన్కు వచ్చిన వాళ్లనుంచి జడ్జీలదాకా అందర్నీ ఆకట్టుకుంది. తర్వాత ‘నల్ల రాజా నల్ల రాజా..’ పాడిన. ‘రేలారే’లో మొత్తం 30కి పైగా పాటలు పాడిన. ఆ ముప్పయ్ పాటలకోసం వందకు పైగా పాటల గురించి పరిశోధన జరిపిన. ‘సముద్రమెంతా లోతు దిగి సూడన్నా.. దిగీ సూడన్నా..’ పాట మంచి గుర్తింపు తెచ్చింది. అన్నాచెల్లెలి పాట ఇది. ‘ఎర్రాగంధపు గడ్డ.. నల్లాగంధపు గడ్డ..’ నా పాట పరిణతిని చాటింది.
చిన్నప్పటి నుంచి పాడుతూ వస్తున్న ‘ఒడ్డొడ్డు గడ్డి కోసి ఒడ్డుకిందా పెట్టి..’ పాటను ‘రేలారే’ వేదికగా పాడాలని అనుకున్నా. కానీ, నాతో కలిసి ఈ పోటీలో పాల్గొన్న కావ్య చందనకు ఈ పాటను ఇచ్చిన. మా అమ్మ, కావ్యచందన వాళ్ల అమ్మ మధ్యలో పాటల గురించి చర్చ వచ్చిందట. ‘కావ్యకు ఈ సమయంలో ఒకట్రెండు మంచి పాటలు దొరికితే బాగుండు. అంతగా స్కోరింగ్ తీసుకొచ్చే పాటలు తన చేతిలో లేవు’ అని కావ్య వాళ్లమ్మ అడిగితే, మా అమ్మొచ్చి ‘కావ్యకు పాటల్లేవట. ఒడ్డొడ్డు పాటను తనకివ్వరాదురా’ అన్నది. అట్లా నేను పాడాలని అనుకున్న ఓ మంచి పాటను కావ్యకు ఇచ్చిన. కావ్య ఆ పాటతో బాగా ఫేమస్ అయింది. చానా సందర్భాల్లో పాట నేనిచ్చాననే విషయం చెప్పింది కూడా.
‘రేలారే’ తర్వాత ‘మార్మోగిన పాట’, ‘జానపదం దుమ్మురేపు’ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నా. మాటీవీ ఐడియా సూపర్ సింగర్లో అవకాశం వచ్చినా వెళ్లలేకపోయిన. అప్పటికే పెండ్లి ఓకే అయ్యింది. ‘పిల్ల టీవీల వచ్చిందట. టీవీ లొచ్చిన పిల్లను చేసుకుంటరా’ అని అంతా సిద్ధమైనంక పెండ్లి క్యాన్సిల్ అయ్యింది. అప్పుడు, కొంత డిప్రెషన్కు గురైన. అదే సమయంలో మా మేనమామ శివశంకర్ దేవుడిలెక్క వచ్చి ‘పదిమందిల పలుచదనం అవ్వుడెందుకు? ఇంకోడుకూడా ఇట్లనే అనడనే గ్యారెంటీ ఏంది? రోజాకు నేను తోడుగుంటా’ అని లగ్గం చేసుకుండు. శివ చానా మంచోడు. నాకు అన్నీ తానై చూసుకుంటడు. ‘నేను చదువుకుంట’ అంటే చదివించిండు. ‘పాటలు పాడుతా’ అంటే అడ్డు చెప్పలేదు. పెండ్లయినంక, పిల్లలు పుట్టినంక పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఎం.ఎ. ఫోక్ చేసిన. తర్వాత బీఈడీకూడా చేసిన. పీజీలో జానపద సిద్ధాంతాలు, కోలాటం, డప్పు, గుర్రం స్వారీ, కర్రసాము నేర్చుకున్నా.
తెలంగాణ ఉద్యమంలో వాడవాడలా తిరిగి తెలంగాణ ఆవశ్యకతను సామాన్య జనానికి తెలియజేసిన. ఉద్యమం ద్వారానే గుర్తింపు వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ వేదికగా పాడుతున్నా. మా అమ్మ నాకు నేర్పిన ‘నిమ్మలు కొట్టేరో రగావోనందాన’ పాటను ఒకట్రెండు సందర్భాల్లో కొన్ని వేదికలల్లో పాడిన. దానిని ఎవరో వాడుకున్నారని తెలిసింది. నా దగ్గర ఇలాంటి పాటలు మస్తున్నయి. ఏదో ఒక సందర్భంలో పాడాల్సి వస్తది. పాడితే ఎవరో ఒకరు వాడుకుంటరు. నా పాటలు ఇట్లా వృథాగా పోవద్దు. అందుకే, తొలి ప్రయత్నంగా అమూల్య స్టూడియోస్ ద్వారా ‘నిమ్మలు కొట్టేరో..’ పాడిన. ఇప్పటికి ఆ పాట 25 మిలియన్ల వ్యూస్ దాటింది. అలాంటి పాటలు యూట్యూబ్లో 15 పైగానే పాడిన. మంచి స్పందన వచ్చింది.
పాటకు ఇచ్చేంత ప్రాధాన్యం చదువులకూ ఇచ్చిన. పాటనుకూడా చదువులో భాగంగానే చూసిన. స్కూల్లో తొలిసారిగా ‘ఒడ్డొడ్డు గడ్డికోసి ఒడ్డుకిందా పెట్టి..’ పాట పాడిన. దీనిని అమ్మ దగ్గర నేర్చుకున్నా. నేను పాడంగ వందేమాతరం, జనగణమన పాటలే విన్న విద్యార్థులు, టీచర్లు ఆశ్చర్యపోయిండ్రు. అది అచ్చమైన జానపదం. జానపద పాటలు కనుమరుగై పోతున్నాయని అనుకుంటున్న సందర్భంలో నేను ఆ పాట పాడటం అందరికీ నచ్చింది. స్కూల్లో ఏదైనా పాటలపోటీ ఉందంటే అందులో ఫస్ట్ప్రైజ్ నాకన్నా వచ్చేది, మా అన్నకైనా వచ్చేది. ‘వాళ్లిద్దరి కోసమే పాటలపోటీలు పెట్టినట్టుంటది. ఫస్ట్ప్రైజ్ వాళ్లదేనాయె, సెకండ్ ప్రైజూ వాళ్లదేనాయె’ అనుకునేవాళ్లు అందరూ.
–దాయి శ్రీశైలం