అక్కడ.. తీరొక్క పూలతో అల్లిన బతుకమ్మలను చూసి భూదేవి పొంగిపోతుంది, గౌరమ్మ మురిసిపోతుంది. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం దాచారంలోని ఓ ఇంట్లో బతుకమ్మ ఏటా ఓ దైవం రూపంలో ముస్తాబు అవుతుంది. దేశోజు శ్యామలమ్మ అనే గృహిణి ముప్పై అయిదేండ్లుగా దేవీదేవతల రూపంలో బతుకమ్మను పేరుస్తున్నది. అమ్మవారు, శివలింగం, వేంకటేశ్వరుడి తిరునామాలు, ఓంకారం, డమరుకం, త్రిశూలం.. ఏ రూపమైనా అపురూపమే. ‘తరాలుగా మేం బతుకమ్మను పేరుస్తున్నాం. 1983లో అమ్మవారి రూపంలో పేర్చిన సద్దుల బతుకమ్మను చూసి గ్రామస్థులు మెచ్చుకున్నారు. అప్పటినుంచీ ఇదే ఆనవాయితీని కొనసాగిస్తున్నాం’ అని చెప్పారు శ్యామలమ్మ-భిక్షమాచారి దంపతులు.
‘గౌరీపరమేశ్వర’ బతుకమ్మ
‘తంగేడు, గునుగు, బంతి, చామంతి, నందివర్ధనం, సీతజడ, తేలిగంటి, జిల్లేడు, నాచు పూలను బతుకమ్మ కోసం వాడుతాం. దుసేరు తీగలతో అల్లిన బుట్టలో గుమ్మడాకులు వేసి, తంగేడు పూల వరుస పేరుస్తాం. దాని మీద నాచు పేరుస్తూ.. ఏరూపం కావాలనుకుంటే ఆ రూపంలో బంతి, చామంతి, జిల్లేడు పూలతో ఓ రూపం తీసుకొస్తాం. పై భాగాన మూడు వరుసలు తేలికపాటి
పూలతో పేర్చి, పసుపు గౌరమ్మను నిలబెడుతాం’ అంటూ ఆ ప్రక్రియనంతా వివరిస్తుంది శ్యామలమ్మ. ఈసారి సద్దుల బతుకమ్మను గౌరీ పరమేశ్వర రూపంలో పేరుస్తానని చెప్పింది.
… దేశోజు యల్లయ్యచారి