కరోనా ఎందరి జీవితాలనో ఆగం చేసింది. అవన్నీ తలచుకొని బాధపడేకన్నా, ఆపదలో ఉన్నవారికి తోడుగా నిలిస్తేనే పరిస్థితిని కొంత మార్చవచ్చు. చెన్నైకి చెందిన సీతాదేవి ఇదే చేస్తున్నది. తన తల్లిలా మరెవరూ వైద్యం అందక ప్రాణాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఓ మంచి పని తలపెట్టింది.
చెన్నైలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ బయట రోజూ ఉదయం ఏడు గంటలనుంచీ ఓ నీలం రంగు ఆటో రిక్షా కనిపిస్తుంది. ఈ ఆటో పక్కన 35 ఏండ్ల మహిళ నిలబడి ఉంటుంది. ఆమె పేరే సీతాదేవి. ఆ బండికి డ్రైవర్ కమ్ ఓనర్. అలా అని, అదేదో ప్రయాణికులను తరలించే ఆటో కాదు. ప్రాణాలు కాపాడే ఆటో. ప్రాణవాయువును ప్రసాదించే ఆటో. గతేడాది సీతాదేవి తల్లికి కొవిడ్ వచ్చింది. ఆమె అప్పటికే డయాలసిస్ రోగి. పరిస్థితి సీరియస్గా ఉండటంతో రాజీవ్గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు తీసుకెళ్లింది సీత. ఖాళీ పడకలు లేనందువల్ల గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. నాలుగు గంటల నిరీక్షణ తర్వాత, లోపలికి వదిలారు. అంతలోనే, ఆక్సిజన్ అందక సీతాదేవి తల్లి ప్రాణాలు కోల్పోయారు.
ఎక్కడికైనా..
తన తల్లి అనుభవించిన నరకయాతనను సీత మర్చిపోలేక పోయింది. ఆమెలా ఎవరూ కష్టపడకూడదని భావించింది. ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ఒక ఆటో రిక్షాను కొనుగోలు చేసింది. అందులో, రోగులను ఆసుపత్రికి తరలిస్తుంది. ఆక్సిజన్ అవసరమైన వారికి వెంటనే సమకూరుస్తుంది. ఆకలితో బాధ పడుతున్న వారికి ఆహారమూ సరఫరా చేస్తుంది. కొన్నిసార్లు ఆ ఆటో వైకుంఠ ధామం వాహనంగాకూడా మారుతుంది. అందులోనే మృతులను శ్మశానానికి తరలిస్తుంది. ప్రజల నుంచి అభ్యర్థనలు పెరగడంతో మరో రెండు ఆటోలు సిద్ధం చేసుకుంది. అంతేకాదు, చెన్నైలోని పది హాస్పిటల్స్లో శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ‘కొవిడ్ సెకండ్ వేవ్లో చాలామంది భయపడ్డారు. వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినవారూ అనేకం. ఆ పరిస్థితులే నన్ను సేవ వైపు నడిపించాయి’ అంటున్నది సీతాదేవి మానవీయత నిండిన స్వరంతో.