‘నేను ప్రకృతికి రక్ష.. ప్రకృతి నాకు రక్ష..’ అన్న నినాదంతో రాఖీ పండుగను నిర్వహిస్తున్నారు ఈ పిల్లలు. పర్యావరణహిత రాఖీలు తయారు చేస్తూ ‘శభాష్’ అనిపించుకుంటున్నారు పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు. ఉపాధ్యాయులు
సంపత్కుమార్, ప్రశాంత రాణి మార్గదర్శనంలో ఎకోఫ్రెండ్లీ విత్తన రాఖీలను మూడేండ్లుగా తయారు చేస్తున్నారు. బెండ, బీర, సొర, కాకర, చిక్కుడు, టమాట వంటి కూరగాయల విత్తనాలతో రాఖీలను తయారు చేసి తోటి విద్యార్థులతోపాటు గ్రామస్తులకూ కడుతున్నారు. మరుసటి రోజు ఆ రాఖీల్లోని విత్తనాలను నేలలో విత్తమని చెబుతున్నారు. గతంలో వీరు నాటిన విత్తనాలు ఇప్పుడు మొక్కలుగా ఎదిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి.
… బుర్రా తిరుపతి, రామగిరి