దాదాపు నలభై ఏండ్ల తర్వాత ఆ తల్లి తన కొడుకును కలుసుకొన్నది. ఆ క్షణంలో ఆ అమ్మ పసిబిడ్డలా ఏడ్చేసింది. ఆ కన్నీళ్ల వెనుక ఓ కథ ఉంది. తూర్పు నేపాల్లోని లుంబక్ గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ తిమిష స్కూల్ టీచర్. తనకు మిలిటరీలో చేరాలని కోరిక. దాన్నో అవకాశంగా తీసుకుని ఓ దళారి తన చుట్టూ తిప్పుకొన్నాడు. భారతదేశానికి తీసుకొచ్చి ఓ మర్డర్ కేసులో ఇరికించాడు. దీంతో, దుర్గా జైలు పాలయ్యాడు. ఇవేవీ తెలియని ఆ తల్లి బడికి వెళ్లిన కొడుకు తిరిగొస్తాడని ఎదురుచూస్తూ కూర్చున్నది. అలా నాలుగు దశాబ్దాలు గడిచాయి. క్రమంగా దుర్గాప్రసాద్ మానసిక రోగిగా మారిపోయాడు. గతాన్ని మరిచిపోయాడు. తన పేరు, తల్లి పేరు, బడి పేరు మాత్రమే గుర్తున్నాయి. జైలులో అతడి సహఖైదీ.. హ్యామ్ రేడియో ఆపరేటర్. బెయిల్మీద బయటికి వచ్చాక, నేపాల్లోని హ్యామ్ రేడియో బృందానికి దుర్గాప్రసాద్ కథంతా చెప్పాడు. ఓ మారుమూల పల్లెలో అతడి తల్లిని గుర్తించారు. కోర్టు అనుమతితో తల్లీ కొడుకులను ఒక్కటి చేశారు. తల్లిని చూసిన ఆనందం వల్ల కావచ్చు, దుర్గాప్రసాద్ మానసిక స్థితి మెరుగుపడుతున్నది.