‘మనశ్శాంతి ఎక్కడి నుంచో రాదు. మన మధ్యే ఉంటుంది. పెంపుడు కుక్కల వల్లా దొరుకుతుంది’ అంటున్నది పుణెకు చెందిన మంజిరి ప్రభు. ‘డాగ్ట్రిన్ ఆఫ్ పీస్’ పేరుతో ఆమె ఓ పుస్తకాన్ని తీసుకొచ్చింది. గతంలో మంజిరి అనేక ఫిక్షన్ నవలలు రాసింది. తాజా పుస్తకం కోసం ఆమె ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసింది. అందులో మేనకాగాంధీ, దియా శర్మ, డాక్టర్ స్టాన్లీ కొరేన్ ఉన్నారు. అలాగే, అమెరికాకు చెందిన తొలి యానిమల్ కమ్యూనికేటర్ స్మిత్తో సంభాషించింది. “బాల్యం నుంచే కుక్కలు నా జీవితంలో భాగమయ్యాయి. అన్ని జంతువుల్లా కాకుండా.. కుక్కలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలన్నది నా అభిప్రాయం. అవి దాదాపు 15 వేల ఏండ్ల నుంచీ మనుషులతో సావాసం చేస్తున్నాయి. మనసులో ఎంత బాధ ఉన్నా, కొద్దిసేపు పెంపుడు కుక్కలతో గడిపితే చాలు. మనసు తేలికపడుతుంది. కానీ, ఆ జాతి మనుగడ సంక్షోభంలో ఉంది. దేశ వ్యాప్తంగా 150 మంది ప్రజలకు ఒకటి చొప్పున వాటి జనాభా ఉంది. ఒక్కో అపార్ట్మెంట్ ఓ కుక్కను దత్తత తీసుకున్నా, ఏ వీధి కుక్కా ఆకలితో అలమటించదు. అవి మనల్ని ఎంతగా నమ్ముతాయో, మనం కూడా వాటిని అంతే నమ్మకంతో, ప్రేమతో పెంచుకోవాలి” అని సూచిస్తున్నది మంజిరి. నిజమే, ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును!