ఒక మంచి సంకల్పాన్ని మాటల్లో చెప్పడం కంటే, కళ్లకు కట్టినట్లు చూపిస్తేనే ప్రభావవంతంగా ఉంటుంది. దానికి చక్కని ఉదాహరణ ‘ఊంబ్ (డబ్ల్యూ.ఓ.ఎమ్.బి- ఉమెన్ ఆఫ్ మై బిలియన్ )’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్. త్వరలో జరగనున్న 12వ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో ఓపెనింగ్ నైట్ ఫిల్మ్గా ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఎంపికైంది. ‘ఊంబ్‘ను అజితేశ్ శర్మ అనే డైరెక్టర్ ప్రజల ముందుకు తెస్తున్నారు. సృష్టి బక్షి అనే మహిళకు సంబంధించిన కథే దీనికి మూలం. 240 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు .. ఇటు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాద యాత్ర చేశారు అజితేశ్. ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఆమె ఎంతోమంది మహిళలను కలిశారు. బడుగుబలహీన మహిళల కష్టాలను విన్నారు, కళ్లారా చూశారు. అవన్నీ మనం ఈ డాక్యుమెంటరీలో చూడొచ్చు. “పితృస్వామ్య వ్యవస్థలో మహిళల పట్ల వివక్ష అనాది నుంచీ వస్తున్నది. బడికెళ్లే ఆడపిల్లల నుంచి పెండ్లయిన మహిళల వరకు అందరూ వేధింపులకు గురవుతున్నారు. ఈ హింస మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. కొవిడ్ సమయంలో లెక్కకు అందని గృహహింస కేసుల గురించి నేనువిన్నాను. ఎన్నో కన్నీటి గాథలను విన్నాను. జీవితంలో ఎదురైన అడ్డంకులన్నీ ఒంటిచేత్తో జరిపేసుకున్న అసాధారణ మహిళల కథనాలతో ముందుకు రాబోతున్నా” అని బక్షి చెప్పుకొచ్చారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఇటు ఆఫ్లైన్, అటు ఆన్లైన్లో జరుగనుంది. ఫిజికల్ ఫెస్టివల్ ఆగస్ట్ 12-20 తేదీల మధ్య జరిగితే, ఆన్లైన్ ఎడిషన్ను మాత్రం ఆగస్ట్ 15 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు.