చిన్నా పెద్దా అందరి చేతుల్లోనూ స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి. రాత్రీపగలూ తేడాలేకుండా వాటికి అంకితమవుతున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి కునుకు తీసేవరకూ స్క్రీన్లలోకి మొహాలు దూర్చేస్తున్నారు. స్మార్ట్ఫోన్లలోని బ్లూలైట్ మనిషి కంటిచూపుపై ప్రభావం చూపుతుందని, ఈ నీలికాంతి నిద్రకూ ఆటంకమేనన్నది ఇప్పటి వరకూ మనం నమ్ముతున్న విషయం. కానీ, కొత్తగా జరిగిన ఓ అధ్యయనం మాత్రం ‘అదంతా అపోహేనని’ కొట్టిపారేసింది. రాత్రి నిద్రపోయే ముందు ఫోన్ చూడటం వల్ల నిద్రలేమి సమస్య వస్తుందనడంలో వాస్తవం లేదని తేల్చేసింది నిపుణుల బృందం. అమెరికాకు చెందిన సైకాలజీ ప్రొఫెసర్ చాడ్ జెన్సర్ కొందరు పరిశోధకులతో కలిసి ఈ ప్రయోగం జరిపారు. ఇందులో మూడు కేటగిరీలుగా మనుషులను విభజించారు.. రాత్రిళ్లు నిద్రపోయే ముందు నైట్మోడ్ ఆన్ చేసి ఫోన్ చూసేవాళ్లు, నైట్మోడ్ ఆన్ చేయకుండా ఫోన్ వాడేవాళ్లు, అసలు నిద్రపోయే ముందు ఫోన్ చూడనివాళ్లు. చివరికి, ఫోన్వల్ల ఎవరూ నిద్రలేమి సమస్యను ఎదుర్కోవడం లేదని తేలింది. ‘ఇన్ని రోజులు ఫోన్లవల్లే నిద్రలేమి కలుగుతుందని అందరూ అనుకున్నారు. నిజానికి, శారీరకంగా శ్రమ అధికంగా ఉన్నప్పుడే త్వరగా నిద్రపడుతుంది. అంతే తప్ప, రాత్రిళ్లు నిద్రించే ముందు ఫోన్లు వాడటం వల్ల కాదు’ అని వివరించారు పరిశోధకుడు చాడ్ జెన్సర్. ఇంతవరకూ నిజమే కావచ్చు. కానీ, ఫోన్లలో మనం చూసే మెసేజ్లు, ఫొటోలు మన మనసుమీద ప్రభావం చూపి, నిద్రాదేవతను దూరం చేస్తాయన్న కోణాన్ని మాత్రం విస్మరించలేం.