కరోనా బాధితులకు అండగా ఎందరో ముందడుగు వేస్తున్నారు. శక్తికి మించి సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా యువభారతం కృషి అపారమైనది. ఢిల్లీకి చెందిన 19 ఏండ్ల దివ్యాన్షి కరోనా కాలంలో నలుగురికి అండగా నిలుస్తున్నది. ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సత్యవతి కళాశాలలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నది దివ్య. ఎన్సీసీ సభ్యురాలిగా అనేక సేవా కార్యక్రమాల్లో వలంటీర్గా పనిచేసింది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి మొదలయ్యాక తనవంతుగా సమాజానికి ఏదైనా చేయాలని భావించింది. కరోనా బాధితులకు అత్యవసరమైన ఆక్సిజన్ సేవలు ఎక్కడెక్కడ, ఎంత మేరకు అందుబాటులో ఉన్నాయో సమాచారం సేకరించి అవసరమైన వారికి చేరవేసింది. తన రచనల ద్వారా ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తున్నది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల నుంచి రూ.4 లక్షల నిధులు సేకరించింది. ఆ మొత్తంతో నిత్యావసరాలు కొనుగోలు చేసి కొవిడ్ బాధిత నిరుపేద కుటుంబాలకు పంచింది. దాదాపు యాభై కుటుంబాలను ప్రత్యక్షంగా ఆదుకున్నది దివ్యాన్షి. ఈ యువతి చేస్తున్న సేవను ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించడం విశేషం. ఇదే విషయాన్ని దివ్యాన్షిని అడిగితే ‘ప్రధాని మెచ్చుకోవడం ఆనందంగా ఉంది. అయితే, ఎవరి మెప్పు కోసమో నేనీ పనులు చేయలేదు. ఇంట్లో ఒక్క వ్యక్తి దూరమైనా ఆ కుటుంబం కోలుకోవడం కష్టం. పైగా ఇంటిపెద్ద దూరమైతే ఓ కుటుంబం రోడ్డున పడుతుంది. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని నా వంతుగా కొంత సాయం చేస్తున్నాన’ని చెప్పుకొచ్చింది దివ్యాన్షి.