‘నాన్నా! నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతా!’ అన్నది దీవెన.ఈ మాట వినగానే పొంగిపోతూ ‘ఎంత కష్టమైనా నిన్ను డాక్టర్ చదివిస్తా తల్లీ!’ అని మాటిచ్చిన తండ్రిని చూస్తూ ఆ తల్లీ పొంగిపోయింది. విధి ఆ తండ్రిని మాటమీద నిలబడకుండా తీసుకెళ్లిపోయింది. పెనిమిటి పోయిన కష్టం ఆ తల్లికి మతి తప్పేలా చేసింది. విధి వెక్కిరించినా ప్రభుత్వం అండగా నిలిచింది. అధికారులే అమ్మానాన్నలయ్యారు.కనిపించని తల్లిదండ్రుల దీవెనలు బాలసదనం ఒడి నుంచి దీవెనను డాక్టర్ బడికి చేర్చాయి. బాలసదనం నుంచి ఈ ఘనత వహించిన తొలి ఆడబిడ్డగా దీవెన నిలిచింది.
హైదరాబాద్లోని ఫలక్నుమా ప్రాంతంలో ఉండేవారు ముఖేష్కుమార్, జ్యోతి దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. పెద్ద కుమార్తె పేరు దీవెన. బాగా చదివేది. పెద్దయ్యాక డాక్టర్ అవుతాననేది. తండ్రి కూడా కూతురు తెలివితేటలకు మురిసిపోయేవాడు. సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో పెను తుపాను రేగింది. ముఖేష్ గుండెపోటుతో అకస్మాత్తుగా కన్నుమూశాడు. ఈ వార్త వినగానే జ్యోతి స్పృహ తప్పి పడిపోయింది. కండ్లు తెరిచాక పిచ్చి చూపులు చూడటం మొదలుపెట్టింది. మతి స్థిమితం తప్పిన తల్లిని చూసి దీవెన కన్నీరు మున్నీరైంది. బంధువులు ఆదరించకపోవడంతో తనకిష్టమైన చదువుకు స్వస్తి పలికి పన్నెండేండ్ల చెల్లెకు, ఏడాది వయసున్న తమ్ముడికి తనే తల్లయింది. తల్లిని ఆస్పత్రిలో చేర్పించింది.
దీవెన దుస్థితి తెలుసుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆమెను కలిశారు. దీవెనతోపాటు ఆమె చెల్లిని, తమ్ముడిని బాలసదనానికి తీసుకొచ్చారు. దీవెనను అక్కడే ఉంచారు. చెల్లెలిని మలక్పేట్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించారు. తమ్ముడిని శిశువిహార్లో చేర్చారు. రోజులు గడుస్తున్నాయి. దీవెనకు చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన అధికారులు ఆమెను ప్రోత్సహించారు. ట్యూషన్ ఏర్పాటు చేసి పాఠాలు చెప్పించారు. ప్రైవేట్గా పరీక్ష రాసిన దీవెన పదో తరగతిలో 9.68 జీపీఏ సాధించి అందరి మన్ననలూ అందుకుంది. అధికారులు, దాతల సహకారంతో ఇంటర్ ఫస్ట్క్లాస్లో పాసైంది. డాక్టర్ కావాలన్న తన కలను నిజం చేసుకునే క్రమంలో నీట్కు సన్నద్ధమవుతుండగా ఆస్పత్రిలో ఉన్న దీవెన తల్లి మృతి చెందింది. ఆ బాధను పంటి బిగువున అదిమిపెట్టి నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించింది. ఇటీవలే వరంగల్ జిల్లా నర్సంపేట్లోని అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో బీఏఎమ్ఎస్ సీటు సాధించింది. కోర్సుకు అవసరమైన ఫీజు రూ.45వేలు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ మంజూరు చేశారు. బాలసదనంలో ఆశ్రయం పొందుతూ డాక్టర్ సీటు సాధించిన తొలి యువతిగా దీవెన రికార్డు సృష్టించింది. ఇటీవల బాలసదనం బాలికలతో తెలంగాణ గవర్నర్ తమిళిసై జూమ్ మీటింగ్ ద్వారా సంభాషించారు. దీవెన సాధించిన విజయానికి అభినందనలు తెలిపారు. ‘దేవుడు నీకు అండగా ఉంటాడు. మంచిగా చదివి డాక్టర్ కావాలి’ అని గవర్నర్ ఆకాంక్షించారు. తల్లిదండ్రులు దూరమైనా మొక్కవోని దీక్షతో డాక్టర్ సీటు సాధించి బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న వందలాది మంది చిన్నారులకు స్ఫూర్తిగా నిలిచింది దీవెన.
నేను డాక్టర్ కావాలన్నది మా అమ్మ కోరిక. బాలసదనంలో నీడ దొరకడం వరం. అమ్మానాన్నలకు దూరమయ్యానని బాధపడే నాకు అధికారులు ఎంతో భరోసా ఇచ్చారు. బాలసదనం అధికారులు, సిబ్బంది తల్లిదండ్రుల ప్రేమను మరిపించారు. వారందరి ప్రోత్సాహంతో నా కోరిక నెరవేరుతున్నది. నేను కష్టపడి చదివి డాక్టర్ అవుతా. జీవితంలో స్థిరపడ్డాక నా చెల్లి, తమ్ముడి బాధ్యతతోపాటు మరో ఇద్దరు అనాథలను చేరదీసి వారిని చదివిస్తాను. ప్రభుత్వం మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తే తమ్ముడు, చెల్లెలితో కలిసి నివాసం ఉండటానికి అవకాశం ఉంటుంది. అందరం ఒకేచోట ఉంటాం.
-జావీద్