పిల్లలు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటే ‘వయసుకు మించిన తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని’ తల్లిదండ్రులు పొంగి పోతుంటారు. కానీ, తెలిసీ తెలియని వయసులో బిడ్డలు ఈ ఉచ్చులో చిక్కుకుంటే చాలా సమస్యలు వస్తాయి. లేచింది మొదలు సెల్ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, టీవీ వీటికే అంకితమవుతున్నారు చిన్నారులు. నిద్రాహారాలు మానేసి స్క్రీన్లకు కండ్లు అప్పగించేస్తున్నారు. ఇది చాలదన్నట్టు, సోషల్ మీడియాతో జట్టు కట్టి మానసికంగా కుంగి పోతున్నారు. దీనికి ఆదిలోనే కళ్లెం వేయాలంటే తల్లిదండ్రులు కింది విషయాలు తెలుసుకోవాలి.
పిల్లలకు విచక్షణా జ్ఞానం తక్కువ. వాళ్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తుంటే పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వివిధ ప్ల్లాట్ఫామ్ల నిర్వాహకులు పిల్లలు ఉపయోగించడానికి కనీస వయసును నిర్దేశించారు.ఫేస్బుక్, ట్విటర్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ 13 ఏండ్లు వాట్సాప్ 18 ఏండ్లు
యూట్యూబ్ 18 ఏండ్లు (13-18 ఏండ్లు పెద్దల అనుమతితో) ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు వాడటానికి పిల్లలను అనుమతించడానికి ముందు, పెద్దలకూ వాటిగురించి పూర్తి అవగాహన అవసరం.
ఈ జాగ్రత్తలు చెప్పండి
అవమాన పరిచే, అశ్లీలమైన పోస్ట్లు పంపకూడదు.ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించినా, విభేదించినా మర్యాద పూర్వకంగానే ఉండాలి.పాస్వర్డ్, వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో పంచుకోకూడదు.డిజిటల్ స్నేహితులను వ్యక్తిగతంగా, ముఖ్యంగా ఒంటరిగా కలిసే ప్రయత్నం చేయరాదు.ప్రమాదకరమైన పోస్టులు వస్తే వాటికి రిైప్లె పంపొద్దు. సెండర్ను బ్లాక్ చేయడం మంచిది.సైబర్ బుల్లీయింగ్, లైంగిక వేధింపులు ఎదురైతే 1098కి ఫోన్ చేయాలి.
డిజిటల్ హైజీన్
ఇంట్లో కుటుంబసభ్యుల మధ్య సత్సంబంధాలు, అనుబంధాలు పిల్లలను పెడదారి పట్టించకుండా కాపాడుతాయి. ఇంట్లో పరిస్థితులు బాగోలేక, ఆప్యాయతలు కొరవడినప్పుడు పిల్లలు సామాజిక మాధ్యమాలకు అలవాటు పడుతుంటారు. అందుకే, ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే! పిల్లల ఏడ్పు మాన్పించడానికి, అన్నం తినిపించడానికి గ్యాడ్జెట్స్ను అలవాటు చేయకూడదు.పడుకునే ముందు చాలామంది పిల్లలకు ఫోన్ చూపిస్తూ ఉంటారు. గంటముందే ఫోన్ పక్కన పెట్టేయాలి. వీటినుంచి వచ్చే నీలిరంగు కిరణాలు నిద్రకు విఘాతం కలిగిస్తుంది.అన్నిటికన్నా ముఖ్యంగా పెద్దవాళ్లు అస్తమానం ఫోన్,ల్యాప్టాప్ పట్టుకొని కూర్చుంటే పిల్లలకూ అదే అలవాటు అవుతుంది. అందుకే, గ్యాడ్జెట్స్ వాడకాన్ని పెద్దలు తగ్గించాలి.
డిజిటల్ ఫ్రీ జోన్స్: డిజిటల్ ఆటాచ్మెంట్ను తగ్గించడానికి ఇంట్లో డిజిటల్ ఫ్రీ జోన్స్ ఏర్పాటు చేసుకోవాలి. బెడ్రూమ్, డైనింగ్ టేబుల్, వంటగది, స్నానాల గదిలో ఫోన్ వాడకంపై వ్యక్తిగత ఆంక్షలు విధించుకోవాలి. రోజులో కొంత సమయంలో ఎవరూ సెల్ఫోన్ ఉపయోగించకుండా ఉండటాన్ని ‘డిజిటల్ ఫాస్టింగ్’ అంటారు.
శారీరక నియమాలు
కంప్యూటర్, సెల్ఫోన్ వాడుతున్నప్పుడు భుజాలపై బరువు పడకుండా సరైన పద్ధతిలో కూర్చోవాలి.
స్క్రీన్ పైభాగం కంటికి సమాంతరంగా ఉండాలి.
కూర్చున్నప్పుడు కాళ్లు 90-100 డిగ్రీల్లో ఉండాలి.
మోచేతులు కంప్యూటర్ టేబుల్కు సమాంతరంగా ఉండాలి. నడుం కింది భాగానికి సపోర్ట్ ఉండేలా చూసుకోవాలి.
ఫోన్ చూస్తున్నప్పుడు మెడను పదేపదే కిందికి, పైకి తిప్పొద్దు.
గ్యాడ్జెట్ను 20 నిమిషాలు చూసిన తర్వాత కనీసం 20 సెకండ్లు దానిపైనుంచి దృష్టి మరల్చి 20 అడుగుల దూరంలో ఉండే వస్తువును చూడాలి. దీనివల్ల కంటిపై ఒత్తిడి తగ్గుతుంది.
-డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి ,పిల్లల వైద్య నిపుణులు