ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయైః ముఖైస్తీక్షణైః
యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్త్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే॥
‘నగాయత్య్రాః పరం మంత్రం న మాతుః పరదైవతమ్’- గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు అని శాస్ర్తాలు చెబుతున్నాయి. ‘యా గాయంతం త్రాయతే సా గాయత్రీ’- గానం చేసిన వారిని కాపాడుతుంది కనుక ఈ మంత్రానికి గాయత్రి అని పేరు. ఈ తల్లి వేదమాత. అన్ని మంత్రాలకు మూలశక్తి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే ఐదు ముఖాలతో; శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి ఉంటుంది. గాయత్రీ ఉపాసన ద్వారా బుద్ధి వికసిస్తుంది. ప్రాతస్సంధ్యలో గాయత్రిగా, మధ్యాహ్న సంధ్యలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగా ఉపాసకులు ధ్యానిస్తారు. ఈ తల్లి ఉపాసన ద్వారా అనంతమైన మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలూ తొలగుతాయి. బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. గాయత్రీ మంత్ర పారాయణ వేదపారాయణం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అమ్మవారు ఈ అలంకారంలో దర్శనమిచ్చినప్పుడు, గాయత్రీ మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించాలి. అమ్మకు అల్లం వడలు నివేదన చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పఠించాలి.