మనిషి సంఘజీవి. ఒంటరిగా మనలేడు. ఇరుగు పొరుగు, బస్సులో తోటి ప్రయాణికులు, ఆఫీస్లో సహోద్యోగులు, కాలిబాటన పాదచారులు ఇలా వందలమందితో కలిసి జీవనం సాగిస్తుంటాడు. చుట్టూ ఎందరున్నా మనసు అందరినీ ఆదరించదు. ఎవరో కొందరినే తనవారని అనుకుంటుంది. అమ్మానాన్న, కుటుంబసభ్యులను నావాళ్లూ అనుకుంటుంది. బాల్య స్నేహితులు, టీనేజ్లో మిత్రులు, ఉద్యోగంలో సహచరులు.. వీరిలో అభిప్రాయాలు కలిసిన వారినే గుర్తుపెట్టుకుంటుంది. వారినే నేస్తాలుగా భావిస్తుంది. మనిషి జీవితంలో ఆప్తులనుకునే వారి సంఖ్య రమారమి 150 ఉంటుందని ఓ పరిశోధనలో తేలింది. ఈ స్టడీని నిర్వహించిన బ్రిటిష్ ఆంథ్రోపాలజిస్ట్ రాబిన్ డన్బర్ పేరుమీద అయినవారి సంఖ్యను ‘డన్బర్స్ నంబర్’గా ఫిక్స్ చేశారు. ఫేస్బుక్, ఇన్స్టా తదితర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్న యువత సాంకేతిక స్నేహితులను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నది. అయితే మనసుకు దగ్గరైన వాళ్లనే నిజమైన ఆప్తులుగా గుర్తించాలన్నది డన్బర్ సూత్రం. ఆ ప్రకారంగా, ఆధునిక జీవితంలోనూ ఆయన ప్రతిపాదించిన సంఖ్యలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని నిపుణుల అభిప్రాయం.