మా పాపకు నాలుగేండ్లు. కరోనా, లాక్డౌన్ కారణంగా ఇంకా బడిలో చేర్పించలేదు. ఇంట్లోనే అక్షరాలు, రైమ్స్ చెబుదామంటే కుదురుగా కూర్చోదు. వచ్చే ఏడాది బడిలో చేర్పిస్తే, అందరిలో వెనుకబడుతుందేమో అని కంగారుగా ఉంది. అదే పరిస్థితి ఎదురైతే తను ఆత్మన్యూనతా భావానికి లోనవుతుందన్న భయం కలుగుతున్నది? ఇలా జరిగితే పిల్లల్లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? వారిని మామూలు స్థితికి ఎలా తీసుకురావడం ఎలా?
పిల్లలు తమలోని సామర్థ్యాలను తక్కువగా అంచనా వేసుకుంటూ ఆత్మన్యూనతా భావానికి గురవుతుంటారు. ఇలాంటి భావనతో ఉన్న పిల్లలు తోటి విద్యార్థులు, స్నేహితులు, టీచర్ల ముందు చాలా ఇబ్బందిగా ఉంటారు. కొన్నిసార్లు కుటుంబసభ్యులతోనూ సరిగ్గా కలవలేకపోతారు. అలాగే వాళ్లలో కోపం, చిరాకు, నిస్తేజం వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్నేహితులతో ఆటలకు, బంధువులతో పార్టీలకు వెళ్లేందుకు విముఖత చూపిస్తారు. అలాగే తల్లిదండ్రులు, టీచర్లు చేసే పనుల వల్ల కూడా కొందరు పిల్లల్లో ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది.
పిల్లలను తోటివారితో పోల్చి తక్కువ చేయడం, సదరు పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించకపోవడం, నలుగురిలో చులకన చేయడం, దురదృష్టవంతులంటూ నిందించడం, నిరుత్సాహపర్చడం వంటి పరిస్థితులు ఎదురైన పిల్లలు ఆత్మన్యూనతకు లోనవుతారు. వారు మామూలు స్థితికి రావాలంటే తల్లిదండ్రులు బాధ్యతతో నడుచుకోవాలి. వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపాలి. పిల్లలను ఇతరులతో పోల్చకూడదు. టీచర్లు కూడా ఇలాంటి పిల్లలను గుర్తించి వాళ్లలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలి. పిల్లలు ఏ చిన్న మంచి పని చేసినా మెచ్చుకోవాలి. అప్పుడే సొంత సామర్థ్యంపై వారికి నమ్మకం కుదురుతుంది. అయితే, ఏ మార్పు అయినా పిల్లల్లో ఆకస్మికంగా కలగదు. ఒక్కొక్కరికీ ఒక్కో సమయం పడుతుంది. అది గమనిస్తూ మీ చిన్నారికి తోడుగా ఉండండి.
సహానా రబీంద్రనాథ్
లైఫ్ కోచ్ అండ్ థెరపిస్ట్ SWITCH NOV,హైదరాబాద్