ఉప్పెనలా విరుచుకుపడే సంద్రాన్ని శాంతింపజేయడానికి కడలికి పూజలు చేసే సంప్రదాయం మనది. ‘వరదతో ముంచెత్తకుండా కరుణ వరద పారించమం’టూ నదీనదాలకు సారె సమర్పించే సంస్కృతి మనది. ఇప్పుడు ప్రపంచాన్ని కకావికలం చేస్తున్న కొవిడ్ను ప్రసన్నం చేసుకోవడానికి కరోనాను దేవతగా భావించి పూజలు చేస్తున్నారు. ఈ మహమ్మారికి ఏకంగా ఆలయం నిర్మించారు. కృష్ణ శిలతో కరోనా అమ్మవారి విగ్రహాన్ని చేసి సశాస్త్రీయంగా ప్రతిష్ఠించారు. తమిళనాడులోని కోయంబత్తూరు శివారులో ఈ వింత ఆలయం వెలిసింది. కరోనా అమ్మవారికి 48 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చెబుతున్నారు పండితులు. మానవాతీతమైన శక్తే ఈ మహమ్మారిని తుదముట్టించగలదని, అందుకే అమ్మవారిని ప్రతిష్ఠించామని సెలవిస్తున్నారు అర్చకులు. ప్రత్యేక పూజల తర్వాత భక్తులను ఆలయంలోకి అనుమతిస్తామని చెప్పుకొచ్చారు. సుమారు వందేండ్ల కిందట దేశవ్యాప్తంగా ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు కూడా కొయంబత్తూరులో ఓ ఆలయం నిర్మించారు. ‘ప్లేగు మరియమ్మన్’ పేరుతో ప్రఖ్యాతిగాంచిన ఆ గుడికి ఇప్పటికీ భక్తులు వెళ్తుంటారు. కరోనాదేవి కోవెల కూడా ఆ కోవకే చెందుతుందన్నమాట!