పిల్లలు నాలుగు గోడలమధ్య ఇరుక్కుని ఏడాది దాటింది. ఆడుకోవడానికి ఫ్రెండ్స్ లేరు. వెళదామంటే స్కూళ్లు లేవు. దీంతో చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. చదువుకోవాలన్నా, ఆడుకోవాలన్నా ఫోన్లే! వీటివల్ల పిల్లలకు మంచికంటే చెడే ఎక్కువ జరుగుతున్నది. ఇది గమనించిన ఒక ఇంగ్లిష్ టీచర్ పిల్లలకోసం ఓ కొత్త ఆలోచన చేశాడు. కోల్కతాకు చెందిన కాళిదాస్ హల్దార్ తన భార్య కుంకుమ్, కొడుకు కింగ్షూక్ ప్రోత్సాహంతో ఒక ‘కూలింగ్ లైబ్రరి’ని ప్రారంభించాడు. ఈ గ్రంథాలయాన్ని ఓ కిరాణా దుకాణంలో ఏర్పాటు చేశాడు. దుకాణంలోని ఒక ర్యాక్లో ఆరొందల పుస్తకాలు ఉంచాడు. దుకాణం బయట పాడైపోయిన డబుల్ డోర్ ఫ్రిజ్లో మరికొన్ని పుస్తకాలు అమర్చాడు. ఈ వీధి గ్రంథాలయంలోని పుస్తకాలు చదవడానికి ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన పనిలేదు. అయితే, తీసుకున్న పుస్తకాన్ని నెల రోజులలోపు కచ్చితంగా తెచ్చివ్వాలి. పాత పుస్తకం ఇచ్చి, మరో పుస్తకాన్ని ఇంటికి తీసుకెళ్లి చదువుకోవచ్చు. ఈ లైబ్రరీకోసం పుస్తకాలు కొనడానికి కాళిదాసు కొడుకు రూ.15 వేలు డొనేట్ చేశాడు. స్కూల్ పోటీల్లో తను గెలిచిన ప్రైజ్మనీని తండ్రికి ఇచ్చేశాడు. ఇలా, ఆ కుటుంబం పిల్లలను విజ్ఞానానికి దగ్గర చేయడానికి ప్రయత్నిస్తున్నది.