ఎండలు దంచుతున్నాయి. కరోనా విజృంభిస్తున్నది. బయటికి వెళ్లలేం. ఇంట్లోనే ఉంటే ఉష్ణోగ్రతలకు ఉడికిపోతాం. అస్తమానం ఫ్యాన్లు, ఏసీలు వేసుకుంటేనేమో కరెంటు బిల్లులు తడిసి మోపెడవుతాయి. మరి ఎలా? ఇంటిని చల్లగా ఉంచుతూ మనమూ చల్లగా ఉండటం ఎలా?
పరదాలు వేయండి: గోడల్ని దాటుకొని వేడిమి ఇంట్లోకి ఎలా చొరబడుతుందా అని అనిపిస్తుంటది కదా? వేడి కిటీకీలు, తలుపుల ద్వారానే దాదాపు 30శాతం వస్తుంది. ఇంట్లో సూర్యుని ప్రతాపం చూపకుండా ఉండాలంటే ముందు కిటికీలకు, తలుపులకు కర్టెన్లు (పరదాలు) వేయాలి. నాణ్యమైన పరదాలు వాడటం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది. ఎంతలేదన్నా 20 డిగ్రీలకు మించి వేడిమి ఉండదు. చూడ్డానికి గ్రీన్హౌజ్ మాదిరిగా ఉంటుంది.
నాణ్యత పెంచండి: మీ ఇంటిని చల్లగా ఉంచడంలో కిటికీలు, తలుపులు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. నాణ్యమైన కిటికీలు, తలుపులు ఉండటం వల్ల బయటి వేడి, దుమ్మును లోపలికి రాకుండా నివారించవచ్చు. దీనివల్ల అస్తమానం ఏసీ వేయాల్సిన అవసరం రాదు.
చల్లని కాంతి: సీఎఫ్ఎల్ బల్బులకు ప్రాధాన్యం ఇవ్వాలి. పెద్దగా వెలుగునిచ్చే బల్బులు చాలా ఉంటాయి. ఇవి 90శాతం కంటే ఎక్కువ శక్తిని ఉపయోగిస్తాయి. ఫలితంగా వేడి పుట్టుకొస్తుంది. పైగా కరెంటు బిల్లు అధికంగా వస్తుంది. అదే సీఎఫ్ఎల్ బల్బులతో ఇలాంటి సమస్య ఉండదు.