‘మీరు క్రమంగా క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నారు. మీకు ఇష్టమైన పనులే చేయండి. సంతోషంగా ఉండండి’.. అన్న డాక్టర్ సలహా ప్రకారం ఆమె చిత్రకళను ఎంచుకున్నది. హాస్పిటల్ బెడ్పై కుంచెతో కాలక్షేపం చేసింది. ఓ వైపు కీమో థెరపీ ఒంటిని కాల్చేస్తున్నా.. చెదరని చిరునవ్వుతో రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరించింది. పట్టుదలతో క్యాన్సర్నే కాదు, క్యాన్వాస్నూ జయించింది సంతోష్ డగా.
హైదరాబాద్, హైదర్గూడ అపోలో హాస్పిటల్కు ఎదురుగా ఉన్న ఈఎఫ్ గార్డెన్స్లో ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతున్నది. అక్కడ అనేక స్టాల్స్ ఉన్నాయి. కానీ, ‘డగాస్ ఆర్ట్ వ్యాలీ’ పేరుతో ఏర్పాటు చేసిన ఓ స్టాల్కు మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. ఓ మహిళ ధైర్యానికి, పట్టుదలకు నిదర్శనం అక్కడున్న కళాఖండాలు. ఆ స్టాల్ నిర్వాహకురాలి పేరు సంతోష్ డగా. చిత్రకారిణి కావాలన్నది ఆమె చిన్నప్పటి కల. కానీ, పరిస్థితులు అనుకూలించలేదు. పెండ్లి, పిల్లలు, బాధ్యతలు.. కుంచె గురించి మరచిపోయేలా చేశాయి. 45 ఏండ్ల వయసులో ఓ పెద్ద కుదుపు. సంతోష్ క్యాన్సర్ బారినపడింది. చాలా థెరపీలే అయ్యాయి. ఆ రసాయన చికిత్సల మధ్య.. తనకోసం తాను రంగుల చికిత్సను ఎంచుకొంది. ఆ ఆర్ట్ థెరపీ ఎంతో ఉపయోగపడింది.
ఆకట్టుకునేలా ..
సంతోష్ చేతినుంచి జాలువారిన హస్తకళలు చూడముచ్చటగా ఉంటాయి. దోశలు వేసే పాన్తో చేసిన వాల్క్లాక్, డ్రై ఫ్రూట్స్తో అలంకరించిన గోడ గడియారం, నాణాలు పొదిగిన ఫొటోప్రేమ్.. ఒక్కో దానికి ఓ ప్రత్యేకత. అందుకే అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 80కి పైగా కళాఖండాలను విక్రయించింది సంతోష్ . ఒక్కోదాన్ని రూపొందించడానికి నాలుగు రోజులు పడుతుంది. ‘కళ నాకు ప్రాణం పోసింది. ఆ రుణం తీర్చుకోడానికి నేను కళాఖండాలకు జీవం పోస్తున్నా’ అంటుందామె.