తల్లిపాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అందులోని వివిధ పదార్థాల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతాయి. ప్రసవానంతరం మొదటవచ్చే పాలను ‘ముర్రుపాలు’ లేదా ‘కొలస్ట్రమ్’ అని అంటారు. గర్భం ధరించిన నాలుగోనెల నుంచే ముర్రుపాల ఉత్పత్తి కొద్దికొద్దిగా ప్రారంభమై ప్రసవం తరువాత నాలుగైదు రోజులలో గరిష్ఠ స్థాయికి చేరుతుంది. వీటిలో ప్రొటీన్లు, సజీవ కణాలు, ఖనిజ లవణాలు, విటమిన్-ఎ,ఇ,బి అపారంగా ఉంటాయి. కొవ్వు పదార్థం, కార్బొహైడ్రేట్లు కూడా అధికమే. ఈ పాల ద్వారా వారం రోజుల వయసు శిశువుకు ఆవుపాలకన్నా ఐదు రెట్లు ఎక్కువగా విటమిన్-ఇ లభిస్తుంది. వాటిలోని రోగ నిరోధక పదార్థాలు వివిధ రుగ్మతల నుంచి కాపాడతాయి. నెలలు నిండని శిశువులకు, తక్కువ బరువుతో జన్మించిన బిడ్డలకు ముర్రుపాలు అమృ తంతో సమానం. ముర్రుపాలు చిక్కగా, లేత పసుపు పచ్చరంగులో ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో వాటిని ‘చీముపాలు’గా అపోహపడతారు. శిశువుకు తాగించడానికి ఇష్టపడరు.
ఇది అశాస్త్రీయమైన ధోరణి. ప్రసవానంతరం మూడో రోజు నుంచి క్రమంగా ముర్రుపాలు సాధారణ పాలలా మారిపోతాయి. వీటిని శాస్త్రీయ పరిభాషలో ‘ట్రాన్సిషనల్ మిల్క్’ అంటారు. క్రమంగా ప్రొటీన్లు తగ్గుతూ, కార్బొహైడ్రేట్లు పెరుగుతూ.. 30 రోజులకు మామూలు స్థాయికి వచ్చేస్తాయి. శిశువు పుట్టిన వెంటనే లేదా సాధ్యమైనంత త్వరలో తల్లిపాలు తాగించడం ప్రారంభిస్తే.. కొలస్ట్రమ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మొదటి కొద్ది రోజులూ శిశువు జీర్ణ వ్యవస్థలో.. కొవ్వు పదార్థాన్ని అరిగించుకోగల లైపేజ్ అనే ఎంజైమ్ తక్కువగా ఉంటుంది. కొవ్వు పదార్థం నామ మాత్రంగా ఉండే కొలస్ట్రమ్ ఈ దశలో బిడ్డకు అవసరం. ఇందులోని యాంటీ
ట్రిప్సిన్ అనే పదార్థం రోగ నిరోధక ప్రొటీన్ పదార్థాలు జీర్ణం కాకుండా నివారిస్తుంది.
-డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు