ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్ల వాడకం పెరిగింది. ఫలితంగా, చాలామంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరికి కనీసం ఏడు గంటల నిద్ర అవసరం. మెదడు ఆరోగ్యం కూడా నిద్రపైనే ఆధారపడి ఉంటుంది. మన మెదడు కణాలు మనలోని శక్తి ఆధారంగానే పని చేస్తాయి. అదే క్రమంలో వ్యర్థ పదార్థాలనూ తయారు చేస్తాయి. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల మెదడులో అసాధారణ స్థాయిలో విడుదలయ్యే బీటా అమిలాయిడ్ కూడా ఓ వ్యర్థ పదార్థమే. అయితే, మనం నిద్రపోయినప్పుడు మెదడు ఇలాంటి చెత్త పదార్థాలను శుభ్రం చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కలలు రాని నిద్ర దశను ‘స్లో వేవ్ స్లీప్’ అంటారు. ఆరేండ్లపాటు సాగిన క్యాలిఫోర్నియా అధ్యయనం ప్రకారం, చాలామంది పెద్ద వయసువాళ్లకు ‘స్లో వేవ్ స్లీప్’ తక్కువగా ఉంటున్నదట. అందువల్లే, అధిక మోతాదులో ‘బీటా అమిలాయిడ్’ వ్యర్థ పదార్థం బ్రెయిన్లో పేరుకు పోతున్నది. కాబట్టి, ప్రతి ఒక్కరూ మంచి నిద్రను అలవాటు చేసుకోవాలి. అప్పుడే, అల్జీమర్స్ రిస్క్ తగ్గుతుందని డాక్టర్లు చెప్తున్నారు. నిద్రలేమి సమస్యలు ఉన్నప్పుడు, నిర్లక్ష్యం చేయకుండా నిపుణులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.