కరోనాతో పిల్లల పాఠాలు, పెద్దల బాతాఖానీలు, ఫ్యాషన్ షోలు.. అన్నిటికీ ఆన్లైన్ వేదికైంది. ఇప్పుడిప్పుడే కొన్ని సంస్థలు ఆఫ్లైన్ తివాచీ పరచి ఫ్యాషన్ ట్రెండ్స్కు స్వాగతం పలుకుతున్నాయి. ఈ నెల 5న మొదలైన ప్యారిస్ హాట్ కుచియో ఫ్యాషన్ వీక్ నాలుగురోజులపాటు కొనసాగనుంది. ఈ అందాల జాతరలో పాల్గొనేందుకు ఎంపికైంది.. మధ్యప్రదేశ్కు చెందిన43 ఏండ్ల వైశాలి షదాంగులే.
ప్యారిస్ హాట్ కుచియో ఫ్యాషన్ వీక్కు మన దేశం నుంచి ఎంపికైన మొదటి మహిళగా వైశాలి రికార్డు సృష్టించింది. ఆమెకు ముందు ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా పాల్గొన్నారు. అరుదైన అవకాశం దక్కించుకున్న వైశాలి గతంలో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లోనూ తన డిజైన్స్ను ప్రదర్శించి అందరి మన్ననలూ అందుకుంది. లండన్, మిలాన్ బొటిక్ డిజైనర్ స్టోర్స్లో వైశాలి డిజైన్ చేసిన దుస్తులు ఏడాదంతా కొలువుదీరి ఉంటాయి. తాజాగా ప్యారిస్ షోలో భారతీయ సంప్రదాయ నేత చందేరీ, కున్లకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని భావిస్తున్నదామె. ‘ఈ ఫ్యాషన్ షో ద్వారా మనదేశ చేనేత సంపద గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలపాలని ఉంది. మా అమ్మ కట్టుకునే చేనేత చీర భలేగా ఉండేది. చిన్నప్పటి నుంచీ ఆ చీరను చాలా ఇష్టపడేదాన్ని. ఎన్ని ఫ్యాషన్ ట్రెండ్స్ వచ్చినా చేనేత వెరైటీలకు సరితూగవు. అందుకే, చేనేతను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాను. ఇండియన్ ఫ్యాషన్ అంటే ఎంబ్రాయిడరీ ఒక్కటే కాదు, ఇక్కడ ఏన్నో రకాల ఫ్యాబ్రిక్స్, శతాబ్దాల చరిత్ర కలిగిన డిజైన్లు ఉన్నాయి. వాటికి సరైన ప్రాచుర్యం కల్పించగలిగితే ఫ్యాషన్ ప్రపంచమంతా భారత్వైపు చూస్తుందనడంలో సందేహం లేదు’ అంటున్నది వైశాలి.