పాఠాలతోపాటు సమాజాన్ని చదువుతున్నాడు. చిక్కు లెక్కలను పరిష్కరిస్తూనే, గ్రామీణ సమస్యలకు పరిష్కారాలూ కనుగొంటున్నాడు. సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు బడి వయసులోనే ఓ బ్రాండ్ను సృష్టించాడు. ఆ తపనకు గుర్తింపుగా ‘డయానా అవార్డు’ సాధించాడు.
తాగే నీరు మొదలు తినే ఆహారం వరకూ సకలం కల్తీమయమే. ఫలితంగా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఆర్థిక పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. జీవితాలు సంక్షోభంలో పడుతున్నాయి. ఎందుకిలా జరుగుతున్నది? మన వంతుగా ఏమీ చేయలేమా? అన్న ప్రశ్న కల్వకుంట్ల హిమాన్షును ఆలోచింప జేసింది. అక్కడితో ఆగకుండా, పరిష్కారం వైపు అడుగులు వేయించింది. అందులో భాగంగానే.. కల్తీ లేని ఆహార పదార్థాల తయారీ కోసం మర్కూక్ మండలం గంగాపూర్ యూసుఫ్ఖాన్పల్లిని ఎంచుకొన్నాడు హిమాన్షు. తన ఆలోచనల పంట.. ‘శోమ ప్రాజెక్టు’ అమలును అక్కడి నుంచే ప్రారంభించాడు. ఆ సామాజిక బాధ్యతకు గుర్తింపుగా ‘డయానా అవార్డు’నుసాధించాడు.
తొలి అడుగు ఇలా..
సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో ఉన్న గంగాపూర్ యూసుఫ్ఖాన్పల్లిని హిమాన్షు గత ఏడాది సందర్శించాడు. అప్పుడే, ఆ పల్లెకు తనవంతుగా ఏదైనా చేయాలని భావించాడు. ఆలోచన వచ్చిందే తడవుగా, సర్పంచ్ గడ్డం ప్రసాద్తో పాటు గ్రామస్తులతోనూ చర్చించాడు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో తాత కేసీఆర్ సేంద్రియ పద్ధతిలో ఆరోగ్యకరమైన కూరగాయలను పండిస్తున్న తీరు తనను ఆకర్షించింది. అదే నమూనాలో, కల్తీలేని ఆహార పదార్థాలను తయారు చేయాలని సంకల్పించాడు. నూటికి నూరు పాళ్లు స్వచ్ఛమైన ఆహార పదార్థాల తయారీ కోసం 10 మంది సభ్యులతో ‘హనుమాన్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ’ని ఏర్పాటు చేశాడు. అందులో సగం మంది మహిళలే. సొంత పెట్టుబడితో పిండి, కారంపొడి, అల్లం, పసుపు, నూనె తయారీ యంత్రాలను సమకూర్చాడు. ఇక్కడ, సౌర విద్యుత్తోనే యంత్రాలు నడుస్తాయి ఈ ఉత్పత్తులను స్థానికంగా విక్రయిస్తున్నారు. వ్యాపారంలో వచ్చే లాభాల నుంచి సభ్యులకు జీతాలు చెల్లిస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను మరింత విస్తరించాలని హిమాన్షు నిర్ణయించాడు. ఇక్కడి ఉత్పత్తులను ‘శోమ’ బ్రాండ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేయబోతున్నారు. వ్యయాలు పోనూ మిగిలిన మొత్తాన్ని గ్రామ అభివృద్ధికే ఖర్చు చేస్తారు. త్వరలోనే, యూనిట్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు సర్పంచ్ ప్రసాద్ తెలిపారు.
సంతోషంగా ఉంది
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించడంతో మా ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆయన మనవడు హిమాన్షు కూడా మా గ్రామాన్ని శోమ ప్రాజెక్టుకు ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉంది. దీనివల్ల కల్తీ లేని ఆహార పదార్థాలు లభిస్తాయి, నిరుద్యోగులకు ఉపాధి కూడా దొరుకుతుంది.
– గడ్డం ప్రసాద్ యాదవ్, గ్రామ సర్పంచ్
… ఇటిక్యాల లక్ష్మణ్, మాచిరెడ్డి నర్సింహారెడ్డి