ధర్మశాస్ర్తాల ప్రకారం మనిషికి సమాజంలో దేనినిబట్టి విలువ ఇవ్వాలి? ఎలాంటి వారికి విలువ ఉండదు?
డి.జి.శ్రీనివాసశర్మ, సుచిత్ర సర్కిల్, హైదరాబాద్
కోపము నుబ్బును గర్వము,
నాపోవక యునికియును, దురభిమానము ని
ర్వ్యాపారత్వము ననునివి,
కాపురుష గుణంబులండ్రు కౌరవనాథా॥
(మహాభారతం, ఉద్యోగపర్వం: 2-32)
ధర్మశాస్ర్తాలకు నిఘంటువు అయిన ‘మహాభారతం’లో ధృతరాష్ట్రునికి విదురుడు చెప్పిన మాటలివి. ‘ఊరికే గొప్పలు చెప్పుకొంటూ బతకడం, అయిన దానికీ- కాని దానికీ కోపంతో రెచ్చిపోవడం, ఎంత సంపద ఉన్నా తృప్తి అనేదే లేకుండా గడపడం, పనీ పాటా లేకుండా తిరుగుతుండటం, పొగరుతో ఎవరినీ లెక్క చేయకుండా ప్రవర్తించడం వంటి అవలక్షణాలు ఉన్న దుర్మార్గులకు సమాజంలోనూ ఎన్నటికీ విలువ ఉండదు. వాళ్ళ దుడుకుచేష్టలకు ఎవరైనా భయపడినట్టు కనిపించినా అది అప్పటికి మాత్రమే’. అలాంటివాళ్లకు కాలమే గుణపాఠం చెపుతుంది.
మంచి ఆలోచనలు ఉండే ఉత్తములకు మాట్లాడే తీరు, మాటలూ చేతలుకూడా ఆదర్శవంతంగా, గొప్పగానే ఉంటాయి. అలాంటివారే ఉత్తములు. వాళ్లకే సంఘంలో విలువ ఉంటుంది. ఎప్పుడూ వాళ్ళ గౌరవం పెరుగుతూనే ఉంటుంది. ‘ఎప్పుడూ ఎవరినీ నొప్పించకుండా, స్వపర భేదాలకు, సుఖదుఃఖాలకు తావివ్వకుండా మెలగుతూ ఉండేవాళ్తే ఉత్తములని’ మన ధర్మశాస్ర్తాలు చెబుతున్నాయి. ‘మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం’ (నరసింహ సుభాషితం: 53). ‘త్రికరణ శుధ్ధిగా ఉంటూ, మనసులో ఉన్నదాన్నే మాటలలో చెబుతూ, దానినే ఆచరించే ఉత్తములకే సమాజం విలువ ఇస్తుంది.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370