నటనలోని గొప్ప వరం ఏమిటంటే.. పాత్ర నచ్చితే ప్రేక్షకులు సొంతం చేసుకొంటారు. ఆ క్యారెక్టర్లో తమను తాము చూసుకొంటారు. అలాంటి అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకొని.. భౌతికంగా దూరమైనా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకొన్నారు సురేఖా సిక్రీ.
2008 నుంచి 2016 వరకు ఒకే ఒక్క సీరియల్లో ఆమె నటించారు. అదే ‘చిన్నారి పెళ్లికూతురు’. ఒక సీరియల్ ఎనిమిదేండ్లు ప్రసారం అయ్యిందంటే దానికి ఎంత ఆదరణ లభించిందో అర్థం చేసుకోవచ్చు. సురేఖ ‘చిన్నారి పెళ్లికూతురు’లో అవికాగోర్కు బామ్మగా నటించారు. అన్ని వయసులవారూ సురేఖ పాత్రను సొంతం చేసుకున్నారు. పిల్లలు బామ్మగా, పెద్దలు అమ్మగా, అత్తగా ఊహించుకొన్నారు. సీరియల్ అయిపోయికూడా చాలా ఏండ్లయింది. కానీ, ఆ పాత్రలతో ప్రేక్షకులకు ఏర్పడిన అనుబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. సురేఖది ఉత్తరప్రదేశ్. తండ్రి వైమానిక దళంలో పనిచేసేవారు. తల్లి ఉపాధ్యాయురాలు. చిన్నప్పటినుంచే సినిమాలంటే ఇష్టం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 1971లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి పట్టభద్రురాలయ్యారు. సినిమాలపై ఆసక్తితో 1978లో చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేశారు. తొలి సినిమా ‘కిస్సా కుర్సీ కా’. ఇదొక పొలిటికల్ డ్రామా. 2018లో వచ్చిన ‘బధాయ్ హో’ సురేఖ చివరి చిత్రం. తన మొత్తం కెరీర్లో మూడుసార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాల్ని అందుకొన్నారు. సురేఖ భర్త హేమంత్ రెగె. కొడుకు రాహుల్ సిక్రీ. ఇప్పుడామె మన మధ్య లేకున్నా తన పాత్రలు, జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి. అమ్మలో, అమ్మమ్మలో, నానమ్మలో సురేఖను చూసుకొంటాం.