హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై చర్చించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏడు జిల్లాలలో పర్యటించి వచ్చిన ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు, ఆయా జిల్లాల్లో నెలకొన్న కొవిడ్ పరిస్థితులు, మహమ్మారి నిర్మూలనకు తీసుకున్న చర్యలు, అధికారులకు ఇచ్చిన సలహాలు, సూచనలు.. తదితర క్షేత్రస్థాయి పర్యటన వివరాలను కేబినెట్కు వివరించారు. ఈ సందర్భంగా మందులు, ఆక్సీజన్ లభ్యత, ఇతర మౌలిక వసతులు సౌకర్యాలపై కేబినెట్ పూర్తిస్థాయిలో చర్చించింది. వ్యాక్సినేషన్, పడకల లభ్యత, ఔషధాల లభ్యత సహా థర్డ్ వేవ్కు సంబంధించిన సన్నద్ధతపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కేబినెట్కు సమాచారం అందించారు. కరోనా నియంత్రణకు సంబంధించి వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం ఇప్పటికే పలు అనుమతులను ఇచ్చిన నేపథ్యంలో, మందులను అందుబాటులో ఉంచడం, జ్వర సర్వేతో సహా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.