అత్తాకోడళ్లంటే ఎప్పుడూ కస్సుబుస్సు లాడుతూనే ఉండాలా? చీటికి మాటికి తిట్టుకుంటూనే కనబడాలా? తరాలు మారుతున్నా ఇదే మూసలో ఇంకా సీరియళ్లు, సినిమాలు తీస్తున్నారు. ఆ పాత చింతకాయ లాజిక్కు ఫుల్స్టాప్ పెడుతున్నారు నటి సమీరారెడ్డి, ఆమె అత్త మంజ్రీ వార్దే. ఎలాంటి ఇగోలకూ వెళ్లకుండా సంతోషంగా వీడియోలు తీసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్లలో వీళ్లిద్దరి హవా నడుస్తున్నది. ‘సస్సీ సాసూ-మెస్సీ మామా’ హ్యాష్ట్యాగ్తో వీళ్లు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. సమీరారెడ్డి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ‘అశోక్’, ‘జై చిరంజీవ’ సినిమాలతో ఆమె సుపరిచితురాలే. అయితే, ఇప్పుడు చాలామంది అత్త మంజ్రీ వార్దే గురించే చర్చించుకుంటున్నారు.
మంజ్రీ వార్దే మంచి పెయింటర్. ఇండిపెండెంట్ డిజైనర్కూడా. ఆమెకు ‘సమంజ్రీ’ అనే క్లాతింగ్ లేబుల్ ఉంది.
వార్దే డాక్టర్ అవ్వాలన్నది పెద్దల కోరిక. కానీ, ఆమె తనకు ఇష్టమైన కమర్షియల్ ఆర్ట్ను ఎంచుకొని, అందులోనే డిగ్రీ పొందారు. ఆర్టిస్ట్గా కెరీర్ను ప్రారంభించారు.
ఇంట్లో చిన్న కాగితం కనిపించినా దానిపై పెయింటింగ్ వేసేవారు మంజ్రీ వార్దే. అదే పెయింటింగ్ ఆర్ట్ని చీరలపై వేయమని ఆమె కొడుకు సలహా ఇచ్చాడు. కానీ, ఫ్యాబ్రిక్పై పెయింట్ చేయడం తనకు నచ్చలేదు. దాంతో డిజిటల్ పెయింటింగ్ని మాధ్యమంగా ఎంచుకున్నారు. ‘భగవద్గీత’లోని సంస్కృత శ్లోకాలు, ఖలీల్ జిబ్రాన్, రూమీ కొటేషన్లను తన పెయింటింగ్స్లో భాగం చేసేవారు. దేవనాగరి స్టయిల్లో ఇంగ్లిష్ ఫాంట్ని క్రియేట్ చేసి, పెయింటింగ్స్లో కలిపేవారు. ఇలా సమంజ్రీ లేబుల్ బాగా పాపులర్ అయింది.
చుట్టూ ఉన్న ప్రపంచమే వార్దేకు ఇన్స్పిరేషన్. సమాజంలోని మనుషులు, ప్రకృతిలోని పక్షులు, చెట్లు, యోగా ఆమె పెయింటింగ్స్లో పాత్రలు.
కోడలు సమీరారెడ్డితో అనుబంధం గురించి మాట్లాడుతూ, “మా ఇంట్లో అత్తాకోడండ్ల మధ్య ఎలాంటి పవర్ గేమ్ ఉండదు. అందరికీ అన్నీ ఓపెన్గా ఉంటాయి. చాలా ఏండ్లు నేను నా ఇంట్లో ఒంటరిగా, స్వతంత్రంగా బతికాను. ఇప్పుడు నాకు
ఇంట్లోనే స్నేహితురాలి లాంటి కోడలు దొరికింది’
“పిల్లలు ఏదో ఒకరోజు పెద్దవ్వాల్సిందే. వాళ్ల దారి వాళ్లు చూసుకోవాల్సిందే. ఆ విషయంలో అమ్మానాన్నలకు స్వార్థం వద్దు. నా ఇద్దరు పిల్లలూ ఎక్కడికైనా వెళ్లి బతికేంత స్వేచ్ఛను ఇచ్చాను” అని సగర్వంగా చెబుతున్నారు ఈ ఆధునిక భావాల అత్తమ్మ.