హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక బడ్జెట్, సాధారణ సమావేశం మంగళవారం జరుగనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్చువల్ విధానంలో సమావేశం జరుగుతోంది. ఈ మేరకు ఇప్పటికే జీహెచ్ఎంసీ వర్చువల్ సమావేశం ఐడీలను సభ్యులకు పంపింది. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత 2021-22 సంవత్సరానికి సంబంధించిన గత డిసెంబర్ 17న స్టాండింగ్ కమిటీ ఆమోదించిన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ఆమోదం అనంతరం జరిగే సాధారణ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలో గెలుపొందిన కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్రెడ్డితో మేయర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారని కమిషనర్ తెలిపారు.