‘భౌతిక దేహమాయలో కూరుకుపోయే మానవునికి ‘ఆత్మ’ దర్శనం ఎప్పుడు, ఎలా లభిస్తుంది?’ఈ ప్రశ్నకు సమాధానం ‘మైత్రేయోపనిషత్తు’లో ఉంది.
‘బృహద్రథుడ’నే రాజుకు ‘ఈ శరీరం నాశనమయ్యేదన్న’ విషయం అనుభవంలోకి వస్తుంది. వెంటనే ఆయనను వైరాగ్యం చుట్టుకొన్నది. దీంతో తన పెద్ద కుమారునికి రాజ్యం అప్పగించి, తపస్సు చేసుకోవడానికి అడవిలోకి వెళ్లాడు. సూర్యుడికి ఎదురుగా తన దృష్టిని నిలిపి, చేతులు పైకెత్తి వెయ్యేండ్లపాటు కఠోర తపస్సు చేశాడు. అగ్నిశిఖవలె తేజోసంపన్నుడైన ‘శాకాయన్యుడు’ అనే మహాముని అక్కడికి వచ్చి, ‘ఏం కావాలో’ కోరుకోమంటాడు. దానికి ఆ రాజు, తనకు ‘తత్వజ్ఞానం’ ఉపదేశించమంటాడు. ‘అది చాలా కఠినమైంది. మరో కోర్కె ఏదైనా కోరుకొమ్మని’ అంటే, బృహద్రథుడు పలికిన మాటలు ఆలోచింపదగ్గవి.
‘పెద్దపెద్ద సముద్రాలు ఇంకి పోతాయి. పర్వత శిఖరాలు నేలరాలి పోతాయి. ధృవుని అంతటి వానికికూడా స్థానచలనమవుతుంది. మహావృక్షాలు కూకటివేళ్లతో పెళ్లగింపబడతాయి. భూగోళం కూడా మునిగిపోతుంది. దేవతలుసైతం స్వర్గంలో ఒక్క తావులో స్థితమై ఉండలేరు. నశించిపోయే ఈ ప్రపంచ భోగాలతో ప్రయోజనమేమిటి? చీకటి బావిలోని కప్పవలె పడివున్న నన్ను ఉద్ధరించండి’. అంతటితోనే ఆ మహాముని కరుణించలేదు. అప్పుడు మళ్లీ రాజు ఇలా అంటాడు. ‘వాస్తవానికి ఈ శరీరం మూత్రద్వారం ద్వారా బయటకు వచ్చింది. ఎముకలతో నిర్మాణమై, మాంసం ద్వారా లేపనం చేయబడి, చర్మంతో కప్పబడి, ఇతర అనేక వ్యర్థపదార్థాలతో నిండి ఉన్నది. ఇంతటి బీభత్స శరీరం నుంచి నన్ను తక్షణం రక్షించండి స్వామీ!’. అప్పుడు శాకాయన్యుడు ప్రసన్నుడై ‘ఆత్మతత్వాన్ని’ వర్ణిస్తాడిలా.
‘బృహద్రథ మహారాజా! నువు ఇక్షాకు వంశంలోనే శ్రేష్ఠుడవు. అందుకే, నీకీ సంకల్పం కలిగింది. శబ్దస్పర్శాదులలో అనర్థాన్ని ఉత్పన్నం చేసే గుణమున్నది. వాటిపట్ల ఆసక్తుడైన జీవాత్మకు పరమ(శ్రేష్ఠ) పదస్వరూప స్మృతి కలుగదు. తపస్సుద్వారా జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ‘జ్ఞానం’ వొంటపట్టిన తర్వాత మనస్సు వశీభూతమవుతుంది. మనస్సు వశమయ్యాక ‘ఆత్మ’ ప్రాప్తిస్తుంది. పిమ్మట ఈ నాశనమయ్యే ప్రపంచం నుంచి ముక్తి లభిస్తుంది. ఏ రకంగా కాలుతున్న కట్టె పూర్తవగానే అగ్ని తనంతట తానే చల్లారిపోతుందో.. అలాగే, చిత్తవృత్తులన్నీ సమసిపోయాక చిత్తం కారణరూప ఆత్మలో శాంతరూపాన్ని ధరిస్తుంది. మనిషి చిత్తం ఎంతగా భోగలాలసతవైపు ఆసక్తి కలిగి ఉంటుందో, అంతగా బ్రహ్మం వైపు ఆసక్తి కలిగి వున్నప్పుడే బంధనాలనుండి విముక్తులవుతారు’.
యం.వి.
నరసింహారెడ్డి
98491 10922