అమ్మల ‘స్నాక్స్' స్టార్టప్

ఒకప్పుడు చిరుతిండ్లు అంటే అమ్మమ్మలూ, నానమ్మలూ చేసిపెట్టే రకరకాల పిండివంటలే. కానీ, నేటితరానికి స్నాక్స్ అనగానే గుర్తొచ్చేది మార్కెట్లో కనిపించే చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్స్! వీటివల్ల ఊబకాయం, అధిక బరువుతోపాటు రకరకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వాటికి ప్రత్యామ్నాయంగా పోషకాలతో కూడిన చిరుధాన్యాలతో కరకరలాడే చిరుతిండ్లను తయారుచేస్తున్నారు హైదరాబాద్కు చెందిన ‘మిగో ఇండియా’ నిర్వాహకులు. ఈ ప్రయత్నం వెనుక రాధ వంగివరపు, మాధవి పొట్టా అనే ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు. తమ సంస్థ ద్వారా మిల్లెట్స్తో జంక్ఫుడ్ రుచికి ఏమాత్రం తీసిపోని స్నాక్స్ను తయారు చేస్తున్నారు. వీటిని పాఠశాలలకూ సరఫరా చేస్తున్నారు. చాలామంది పిల్లలు స్నాక్స్ టైమ్లో బయటి చిరుతిళ్లు కొనుక్కుంటారు. దానికి బదులుగా, ఆ సమయానికి మిల్లెట్స్తో తయారు చేసిన కిచిడీ, మొలకలు ఇవ్వడం ప్రారంభించారు. లంచ్ కోసం బాక్స్లో చక్కని భోజనం సర్దే తల్లిదండ్రులు కూడా, సాయంత్రం తమ పిల్లలు తినడానికి మాత్రం మార్కెట్ రుచుల వైపే మొగ్గ్గు చూపుతున్నారు. ఈ అలవాటును మాన్పించడానికి పై విధానాన్ని ప్రవేశపెట్టామని చెబుతారు నిర్వాహకుల్లో ఒకరైన రాధ. ప్రభుత్వ సాయం కూడా అందడంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్(ఐఐఎంఆర్)తో కలిసి రాధ, మాధవి ఈ స్టార్టప్ను స్థాపించారు. మెల్లగా తమ పరిధిని పెద్దలకూ విస్తరిస్తూ.. డెలాయిట్, ఫేస్బుక్ వంటి సంస్థలకు కూడా చిరుతిండ్లను సరఫరా చేస్తున్నారు.