నల్లగొండ ప్రతినిధి, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలో కరోనా వ్యాప్తికి కళ్లెం పడుతున్నది. టెస్టులు పెద్ద సంఖ్యలో పెంచినా కేసుల సంఖ్య అంతకంతకూ తగ్గుతుండడం ఉపశమనాన్ని ఇస్తున్నది. లాక్డౌన్ ప్రారంభంలో పాజిటివిటీ రేషియో 31.4 శాతం ఉండగా, ఈ నెల రెండో వారం ముగిసేటప్పటికి 6.39 శాతమే నమోదైంది. ఓ వైపు లాక్డౌన్ అమలు, మరోవైపు ఇంటింటి జ్వర సర్వేతో వైరస్ వ్యాప్తిని ప్రభుత్వం త్వరగా అడ్డుకోగలుగుతున్నది. నకిరేకల్ మినహా జిల్లావ్యాప్తంగా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జనం రోడ్లపైకి రాకుండా కంట్రోల్ చేయడం, కొవిడ్ కేసులు రోడ్లపైకి రాకుండా కంట్రోల్ చేయడం, కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు పెట్టి టెస్టులు చేయడం, లక్షణాలు ఉన్నవారిని ఐసొలేషన్ కేంద్రాలు తరలించడం, శుభకార్యాల్లో నిబంధనలు పాటించేలా అధికారులు కఠినంగా వ్యవహరించడం మరింతగా సత్ఫలితాలను ఇస్తున్నది. శనివారంతో లాక్డౌన్ గడువు ముగియనుండడంతో పొడిగింపు ఉంటుందా, లేదా? ఉంటే సడలింపు సమయం ఎలా ఉంటుందనే దానిపై అంతటా చర్చ నడుస్తున్నది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నేడో, రేపో నిర్ణయం తీసుకునే అవకాశమున్నదని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నల్లగొండ జిల్లాలోనే లాక్డౌన్ సడలింపు సమయం అతి తక్కువగా ఉంది. అన్నిచోట్ల్లా సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపు ఉంటే జిల్లాలోని మెజార్టీ ప్రాంతాల్లో మాత్రం మధ్యాహ్నం 2గంటల వరకే అవకాశం కల్పించారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఏపీ సరిహద్దు ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో పాటు పాజిటివ్ రేట్ కూడా ఇంకా తగ్గించాలంటే లాక్డౌన్ను యథావిధిగా కొనసాగించాలని ఈనెల 8న ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నల్లగొండ జిల్లాలో నకిరేకల్ నియోజకవర్గం మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కేవలం 8గంటలు మాత్రమే లాక్డౌన్కు మినహాయింపు ఇచ్చారు. మధ్యాహ్నం 2గంటల నుంచి మర్నాడు ఉదయం 6గంటల వరకు కఠినంగా లాక్డౌన్ అమలవుతున్నది.
గ్రామాల్లో సైతం ప్రత్యేక దృష్టి సారించి కట్టడి చేస్తున్నారు. ముఖ్యంగా మండలాల వారీగా కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆయా గ్రామాల్లో ఎక్కడికక్కడే పరీక్షలు నిర్వహించడంతోపాటు లక్షణాలు ఉన్న వారిని సైతం హోంఐసొలేషన్ చేశారు. నల్లగొండ మండలం దండెంపల్లి, అప్పాజీపేట లాంటి గ్రామాల్లో రోజంతా పోలీసులు గస్తీ నిర్వహిస్తూ అనవసరంగా ప్రజలు బయటకు రాకుండా చూస్తున్నారు. పాజిటివ్ వచ్చి బయట తిరుగుతున్న వారిని సైతం గుర్తించి కేసులు నమోదు చేసి ఎంజీ యూనివర్సిటీ ఐసొలేషన్ కేంద్రానికి తరలించారు. ఇంకా అక్కడక్కడ ఇటీవల పెళ్లిళ్లు, పండుగలు, ఇతర ఫంక్షన్ల పేరుతో ప్రజలు ఒకేచోట గుమికూడిన గ్రామాల్లో కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి గ్రామాలపైనా ప్రత్యేక దృష్టి సారించి కట్టడికి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మే నెల రెండో వారంతో పోలిస్తే ఐదింతల కేసులు తగ్గిపోయినట్లు వైద్యశాఖాధికారుల లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
6.36 శాతానికి తగ్గిన పాజిటివ్ రేషియో
కరోనా సెకెండ్ వేవ్లో భాగంగా నల్లగొండ జిల్లాలో సరిగ్గా ఏప్రిల్ రెండో వారం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఏప్రిల్ రెండో వారంలో 8.1శాతం నుంచి మెల్లమెల్లగా మే రెండో వారానికి వచ్చే సరికి తారాస్థాయికి చేరుకున్నాయి. 31.4శాతానికి పాజిటివ్ రేషియో నమోదైంది. దీంతో ఎక్కడ చూసినా పాజిటివ్ బాధితులే దర్శనం ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని ఆస్పత్రుల్లోనూ భారీగా పాజిటివ్ పేషెంట్ల సంఖ్య పెరిగిపోయింది. చికిత్స కోసం బెడ్స్ దొరకని దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన లాక్డౌన్ను విధించింది. లాక్డౌన్ విధించిన మూడు రోజుల తర్వాత కేసుల సంఖ్యలో తగ్గుదల మొదలైంది. మే 16 నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆ తరవాత మే మూడు, నాలుగో వారంలో మంచి ఫలితాలు కనిపిచించాయి. మే మొదటివారంలో 30.1శాతం ఉంటే రెండో వారంలో 31.4శాతం, మూడో వారంలో 22.6శాతం, నాలుగో వారంలో 16.7శాతానికి పాజిటివ్ రేట్ తగ్గింది. ఇక జూన్ నెల రెండు వారాల్లోనూ తగ్గుదల నమోదవుతూ వచ్చింది. ఈ నెల మొదటి వారంలో 8.71శాతం పాజిటివ్ రేషియో నమోదు కాగా, రెండో వారంలో ఇంకా తగ్గి 6.39శాతం మాత్రమే కనిపించింది. వచ్చే వారంలో దీన్ని 5శాతం దిగువకు పరిమితం చేయాలని జిల్లా అధికార యంత్రాంగం తీవ్రంగా కృషి చేస్తున్నది. వరుసగా నాలుగు వారాల్లో పరీక్షల సంఖ్య భారీగా పెరుగుతున్నా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గిపోతూ వస్తుండడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
భారీగా పెరిగిన పరీక్షలు
కరోనా పరీక్షలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు. అన్ని పీహెచ్సీ కేంద్రాలతోపాటు ఏరియా, జిల్లా కేంద్ర దవాఖానల్లోనూ అవసరమైనన్ని ర్యాపిడ్ కిట్స్ను అందుబాటులో ఉంచారు. వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్ష చేస్తున్నారు. మే చివరి వారంతోపాటు ఈ నెల మొదటి వారంలో ఒక్కో రోజు 9వేల వరకు కూడా పరీక్షలు నిర్వహించారు. ఈ నెల ఒకటి నుంచి 16 వరకు మొత్తం 1,04,724 కరోనా పరీక్షలు చేశారు. గత రెండు విడుతల్లోనూ ఇదే అత్యధికం కావడం గమనార్హం. అయితే 12నుంచి పరీక్షలకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తున్నది. 12న 6,437 మంది వస్తే 13న 2,908 మంది, 14న 4,533 మంది, 15న 4,985 మంది, 16న 4,949 మంది మాత్రమే పరీక్షల కోసం వచ్చారు. ఈ రోజుల్లో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా ఆరు శాతానికి అటీటుగా నమోదయ్యాయి. దీంతో మొత్తంగా చూస్తే నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ చర్యలతో కరోనా అదుపులోకి వస్తున్నట్లుగా స్పష్టమవుతున్నది. దీనిపై జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ కొండల్రావు స్పందిస్తూ జిల్లాలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. అడిగిన వారికల్లా పరీక్షలు చేయడంతోపాటు ప్రాథమిక దశలోనే వారిని గుర్తించి ఐసొలేషన్ చేసి కిట్స్ పంపిణీ చేయడం ద్వారా వ్యాప్తిని కట్టడి చేయగలిగామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 6శాతమే పాజిటివ్ రేట్ నమోదవుతుందని వివరించారు. అయినా ప్రజలు తప్పనిసరిగా భౌతికదూరం పాటిస్తూనే మాస్క్ ధరించాలన్నారు. తరచూ శానిటైజ్ చేసుకోవడంతోపాటు అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.
లాక్డౌన్ పొడిగింపుపై ఉత్కంఠ..
ఈ నెల 19నాటికి మధ్యాహ్నం 2గంటల వరకే లాక్డౌన్ మినహాయింపు ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇది నాలుగు గంటల వ్యవధి తక్కువ. ఈ నేపథ్యంలో ఎల్లుండి నుంచి లాక్డౌన్ పొడగింపు ఎలా ఉంటుందనే విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా సడలింపును ఇస్తారా? లేదంటే ప్రస్తుతం ఉన్న విధంగానే కొన్ని గంటలు తక్కువగా సడలింపు ఉంటుందా అన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది.