ఎల్లారెడ్డి రూరల్/ నాగిరెడ్డిపేట్/ రామారెడ్డి, జూన్ 11: దుకాణాల్లో విక్రయించే వివిధ బ్రాండ్ల విత్తనాలకు తప్పనిసరిగా సేల్స్ పర్మిట్ ఉండాలని టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని విత్తన విక్రయ దుకాణాలను శుక్రవారం వారు తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా వరి విత్తనాలను విక్రయించొద్దన్నారు. పట్టణంలోని సీడ్ దుకాణాల్లో విత్తనాలకు సంబంధించి స్టాక్ను పరిశీలించి, రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు కామారెడ్డి ఏడీఏ శశిధర్రెడ్డి, కామారెడ్డి ఏవో శ్రీనివాస్రావు, దేవునిపల్లి ఎస్సై మన్సూర్ఖాన్, ఎల్లారెడ్డి మండల వ్యవసాయాధికారి గాటాడి సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలోని విత్తన, ఎరువుల విక్రయ దుకాణాలను టాక్స్ఫోర్స్ బృందం సభ్యులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను విక్రయించాలని సూచించారు. నాసిరకం, గడువు ముగిసిన విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి డివిజన్ వ్యవసాయ అధికారి శశిధర్, ఏవోలు శ్రీనివాస్, విజయశేఖర్, టాస్క్ఫోర్స్ ఎస్సై మన్సూర్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామంలో మండల వ్యవసాయాధికారి హరీశ్కుమార్, ఎస్సై అంబీర్ భువనేశ్వర్రావు, ఆర్ఐ వేణు ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాసిరకం విత్తనాలు అమ్మితే కేసులు నమోదు చేస్తామన్నారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు తప్పకుండా రసీదు ఇవ్వాలని సూచించారు.