హైదరాబాద్, జూన్ 2, (నమస్తే తెలంగాణ): అత్యుత్తమ సేవలందించిన పోలీసులకు రాష్ట్రప్రభుత్వం సేవాపతకాలను ప్రకటించింది. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఈ జాబితాను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీ స్ పతకాలను గజ్వేల్ ఏసీపీ పాలకూరి నారాయణ, డీజీపీ కార్యాలయం ఐటీ సెల్ కానిస్టేబుల్ వై రాంరెడ్డికి ప్రకటించారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలతోపాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్), ఫైర్ సర్వీసెస్, ఏసీబీ, విజిలెన్స్ విభాగాల్లో ఉత్తమ సేవలందించిన మరో 661 మందికి ఇతర పతకాలను ప్రకటించారు. గ్రేహౌండ్స్ జూనియర్ కమాండెంట్ జీ ఆంజనేయులు, అగ్నిసాలార్జంగ్ మ్యూజియం అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ టీ శ్రీనివాస్, గౌలిగూడ ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్మెన్ కే సునీల్ శౌర్య పతకాలకు ఎంపికయ్యారు. వివిధజిల్లాల్లో పనిచేస్తున్న పోలీసుల్లో 8 మందికి మహోన్నత సేవాపతకాలు, 92 మందికి ఉత్తమ సేవాపతకాలు, 45 మందికి కఠిన సేవాపతకాలు, 464 మందికి సేవాపతకాలు లభించాయి. ఎస్పీఎఫ్ నుంచి ముగ్గురికి ఉత్తమ సేవాపతకాలు, 15 మందికి సేవా పతకాలు దక్కా యి. ఏసీబీలో నలుగురు ఉత్తమ సేవా, ఐదుగురికి సేవా పతకాలకు, విజిలెన్స్ నుంచి ఇద్ద రు ఉత్తమ సేవా, ఐదుగురు సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఫైర్ సర్వీస్లో ఇద్దరికి శౌర్య, ఒకరికి ఉత్తమసేవా, 14 మందికి సేవా పతకాలను ప్రకటించారు. శౌర్య పతకం వచ్చిన వారికి ప్రతి నెలా రూ.500తోపాటు ఒకేసారి రూ.10 వేలు నగదు ప్రోత్సాహకం ఇస్తారు. అదేవిధంగా మహోన్నత సేవా పతకం కింద 40 వేలు, ఉత్తమ సేవాపతకం కింద రూ.30 వేలు, కఠినసేవా, సేవా పతకం కింద రూ.20 వేల చొప్పున అందజేస్తారు.