ఆసియా చాంపియన్షిప్లో మెరిసిన భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ ఫైనల్ చేరింది. కెరీర్లో ఇప్పటికి ఐదు ఆసియా స్వర్ణాలు దక్కించుకున్న మణిపూర్ మణిపూస సెమీస్లో ప్రత్యర్థిని చిత్తుచేసి తుదిపోరులో అడుగుపెట్టింది. సాక్షి, పూజారాణి, అనుపమ,లాల్బువత్సాహి కూడా బంగారు పోరుకు దూకుకెళ్లారు. సిమ్రన్జిత్, మొనికా, జాస్మిన్ , లవ్లీనా, స్వీటీ కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. టోర్నీలో ఇప్పటికే భారత్కు 15 పతకాలు పక్కా కాగా.. ఆసియా టోర్నీ చరిత్రలో ఇదే అత్యత్తుమ ప్రదర్శన.
దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత దిగ్గజం మేరీకోమ్తో పాటు మరో నలుగురు మహిళా బాక్సర్లు స్వర్ణ పతక పోరుకు దూసుకెళ్లారు. గురువారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్ బౌట్లలో సత్తాచాటి ముందడుగేశారు. మహిళల 54 కేజీల విభాగం సెమీస్లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీ 4-1తో లుత్సైఖాన్ అల్టన్సెట్సెగ్ (మంగోలియా)ను చిత్తుచేసింది. ఆరంభ రౌండ్లో ఆచితూచి ఆడిన టాప్సీడ్ మేరి ఆ తర్వాత దూకుడు ప్రదర్శించింది. పదునైన పంచ్లతో మంగోలియా బాక్సర్ను కోలుకోనివ్వలేదు. చివరికి ఏకపక్షంగా విజయం సాధించింది. ఇప్పటికే ఆరు ఆసియా పతకాలు సాధించిన కోమ్ ఈసారి ఫైనల్లో నాజిమ్ కిజైబే (కజకిస్థాన్)తో తలపడనుంది. మరో సెమీస్లో సాక్షి (54 కేజీలు) 3-2 తేడాతో దినా జోలామన్ (కజకిస్థాన్)పై గెలిచింది.
అనుపమ (81+ కేజీలు) 4-1తో మొఖిరా అబ్దుల్లాఇవా (ఉజ్బెకిస్థాన్)పై అలవోకగా గెలువగా.. పూజాకు వాకోవర్ లభించింది. తుదిపోరులో మవ్లుదా మవ్లోనోవాతో పూజ తలపడనుంది. ఆసియా టోర్నీలో తొలిసారి అడుగుపెట్టిన లాల్బువత్ సాహి (64 కేజీలు) సెమీస్లో నౌరా ఆల్ముతైరీపై నెగ్గి.. తుదిపోరుకు చేరింది. మొనికా (48 కేజీలు) 0-5 తేడాతో అలువా బాల్కిబెకోవా (కజకిస్థాన్)పై కనీస పోరాటం లేకుండానే ఓడి కాంస్యంతో సరిపెట్టుకోగా… జాస్మిన్ (57 కేజీలు) కూడా 0-5తో వాదిస్లావా కుఖ్తా చేతిలో పరాజయం పాలైంది. మరో సెమీఫైనల్లో భారత బాక్సర్ సిమ్రన్జిత్ కౌర్ (60 కేజీలు) 0-5తో రిమా వోలేసెన్కోపై పరాజయం పాలైంది. లవ్లీనా బోర్గహైన్ (69 కేజీలు), స్వీటీ (81 కేజీలు) కూడా సెమీస్ బౌట్లలో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.
నేడు పురుషుల సెమీస్
ఆసియా చాంపియన్షిప్ పురుషుల సెమీస్లో అమిత్ పంగాల్ (52 కేజీలు), వరీందర్ సింగ్ (60 కేజీలు), శివ థాపా (64 కేజీలు), వికాస్ కృష్ణన్ (69 కేజీలు), సంజీత్ (91 కేజీలు) శుక్రవారం బరిలోకి దిగనున్నారు. వీరిలో అమిత్, కృష్ణన్ టోక్యో ఒలింపిక్స్కు ఇప్పటికే అర్హత సాధించిన సంగతి తెలిసిందే. సెమీస్లో బకోదూర్ ఉస్మొనొవ్ (తజకిస్థాన్)ను థాపా ఢీకొట్టనుండగా.. సాకెన్ బిబోసినోవ్తో పంగాల్ తలపడనున్నాడు.