న్యూఢిల్లీ, మే 25: అద్భుతాలకు ఆలవాలంగా నిలిచే వినీలాకాశంలో మరో అపురూప దృశ్యం ఆవిష్కృతం కాబోతున్నది. బుధవారం (మే 26న) సూపర్ మూన్, చంద్రగ్రహణం రెండూ ఒకేసారి కనువిందు చేయనున్నాయి. సూపర్మూన్, చంద్రగ్రహణం ఒకే రోజున ఏర్పడటమనేది సాధారణంగా ప్రతి ఆరేండ్లకు ఒకసారి జరుగుతుంది. అయితే జనవరి 2019 తర్వాత రెండేండ్ల వ్యవధిలోనే ఈ దృశ్యం మళ్లీ కనువిందు చేయనుండటం విశేషం. చంద్రుడి కక్ష్య భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు జాబిల్లి పెద్దగా కనిపిస్తుంది. ఈ దృగ్విషయాన్నే ‘సూపర్మూన్’గా పిలుస్తారు. బుధవారం సంభవించే సూపర్మూన్-చంద్రగ్రహణాన్ని అమెరికా, కెనడా, మెక్సికో, మధ్య అమెరికా, ఈక్వెడార్, పశ్చిమ పెరూ, దక్షిణ చిలీ, అర్జెంటీనా వాసులు చూడొచ్చు. అయితే, మన దేశం నుంచి పాక్షిక చంద్రగ్రహణాన్ని మాత్రమే వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 4.58 గంటల మధ్య ఈశాన్య రాష్ర్టాలు, పశ్చిమబెంగాల్, ఒడిశా తీరప్రాంతాలు, అండమాన్-నికోబార్ దీవుల వాసులు పాక్షిక చంద్రగ్రహణ దృశ్యాల్ని చూడొచ్చన్నారు.