సిటీబ్యూరో, మే 20(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సమయంలోనూ హైదరాబాద్ మెట్రో పాలిటన్ సంస్థ (హెచ్ఎండీఏ) అధికారులు అభివృద్ధి పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు. సుమారు 150 ఎకరాల స్థలంలో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలకు అవసరమైన విధంగా అత్యున్నత ప్రమాణాలతో కోకాపేట లే అవుట్ను అభివృద్ధి చేస్తున్నారు. అదే విధంగా కోకాపేట మూవీ టవర్స్ సమీపంలో ఓఆర్ఆర్పై ట్రంపెట్, నార్సింగి చౌరస్తాలో ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ పనులను చేపడుతున్నారు. ఇందుకోసం సుమారు రూ.270 కోట్లను హెచ్ఎండీఏ వెచ్చిస్తున్నది. ఈ పనులను ఇంజినీరింగ్ విభాగం అధికారులు నిత్యం పరిశీలిస్తున్నారు.
గ్రేటర్ చుట్టూ 158 కి.మీ పొడవునా కోట్లాది మొక్కలను పెంచుతున్నారు. ఇందుకోసం ప్రతియేటా రూ.47 కోట్లు వెచ్చిస్తున్నారు. నాటిన మొక్కలకు ఏడాది పొడవునా నీరు అందించేందుకు డ్రిప్ట్ ఇరిగేషన్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే టెండర్లు పిలిచారు.
హెచ్ఎండీఏ పరిధిలోని అర్బన్ ఫారెస్ట్ , ఇంజినీరింగ్ విభాగం, లేక్స్ డివిజన్ అధికారులు పార్కులు, చెరువుల సుందరీకరణ పనులు చేపడుతున్నారు. గండిపేట చెరువుతో పాటు మరో 20 చెరువులను సుమారు రూ.150 కోట్ల వ్యయంతో సుందరీకరించే పనిలో ఆయా విభాగాల అధికారులు నిమగ్నమై ఉన్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్లో ఉన్న గండిపేట చెరువులో 18 ఎకరాల స్థలంలో రూ.30 కోట్లతో సర్వాంగ సుందరంగా ఓ పార్కు సుందరీకరణ పనులు గత 5-6 నెలల నుంచి నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఆగస్టు నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. మరో 20 చెరువుల సుందరీకరణ పనులు ఆగిపోకుండా లేక్స్ ప్రొటెక్షన్ విభాగం అధికారులు క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్నారు.