కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు
ఈ నెల 15 నుంచి తాండూరులో..
తీర్మానాలు చేస్తున్న గ్రామ పంచాయతీలు
వ్యాపారస్తులు, గ్రామస్తుల మద్దతు
మధ్యాహ్నం నుంచి దుకాణాల మూసివేత
తాండూరు, మే 9: నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న ఆధ్వర్యంలో వ్యాపారులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆదివారం సమావేశమయ్యారు. ఈ నెల 15వ తేదీ నుంచి 24 వరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. 12 తర్వాత పూర్తిగా బంద్ చేసి లాక్డౌన్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాండూరు వ్యాపారులు, వివిధ సంఘాల ప్రతినిధులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నందుకు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ అభినందించారు.
పెద్దేముల్లో 10 రోజులు..
పెద్దేముల్, మే 9 : కరోనా నియంత్రణలో భాగంగా ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పెద్దేముల్ గ్రామంలో లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు జడ్పీటీసీ ధారాసింగ్ తెలిపారు. ఆదివారం గ్రామ పంచాయతీలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, వ్యాపారస్తులతో కలిసి స్వచ్ఛంద లాక్డౌన్పై తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి 20వరకు 10 రోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్ విధిస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు అన్ని రకాల దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. నిబంధనలు ఉల్లఘించినట్లయితే వారికి రూ.2000 వేల జరిమానా విధిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అంబరయ్య, ఉపసర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, వార్డు సభ్యులు ఫయాజ్, అరవింద్, మల్లేష్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నర్సింహులు, గ్రామ పెద్దలు నరేశ్రెడ్డి, ఆజం ఖాన్, కారోబార్ నర్సిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుజ్జమ్మ, రంగయ్య, వీరు, వ్యాపారస్తులు అనంతకోటి, శ్రీనివాస్, సంతోష్, అఖిల్, నందు, నర్సింహులుగౌడ్, పాండుగౌడ్, శ్రీనివాస్గౌడ్, రమేశ్ గౌడ్, వెంకటేష్, విఠల్, షేరు, ఆరిఫ్ పాల్గొన్నారు.
కరోనా బాధితులకు బీసీ హాస్టల్లో ఐసొలేషన్
కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించడానికి మండల కేంద్రంలోని బీసీ బాలుర హాస్టల్లో సుమారు 10 బెడ్లతో కూడిన ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు జడ్పీటీసీ ధారాసింగ్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు నర్సింహులు తెలిపారు.