న్యూఢిల్లీ, మే 8: దేశమంతా కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతున్న వేళ బ్లాక్ ఫంగస్ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్ మ్యూకోర్మైకోసిస్ కేసులు పెరగడం ఆందోళనను రెట్టింపు చేస్తున్నది. కరోనా నుంచి కోలుకొంటున్నవారిపై బ్లాక్ ఫంగస్ పంజా విసురుతున్నది. మహరాష్ట్రలో ఈ ఇన్ఫెక్షన్తో ఇప్పటివరకు ఎనిమిది మంది చనిపోయారు. రాష్ట్రంలో దాదాపు 200 మంది ఈ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (డీఎంఈఆర్) హెడ్ తాత్యారావు లాహానే తెలిపారు. ఇది ఇంతకుముందు తెలిసిన వ్యాధే అయినప్పటికీ కొవిడ్ సోకినవారిలో వేగంగా వృద్ధి చెందుతున్నదని చెప్పారు. ‘బ్లాక్ ఫంగస్ శరీరంలో సులభంగా, వేగంగా విస్తరిస్తుంది. అది మెదడును చేరితే మరణం సంభవిస్తుంది’ అని లాహానే
తెలిపారు.
అహ్మదాబాద్లో రోజుకు 7 ఆపరేషన్లు
గుజరాత్లోని అహ్మదాబాద్లో గడిచిన 20 రోజుల్లో 67 మంది రోగుల్లో బ్లాక్ ఫంగస్ను గుర్తించినట్టు బీజే మెడికల్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ కల్పేశ్ పటేల్ తెలిపారు. కొంత మందికి శస్త్రచికిత్సలు చేశామని, ఇంకా 45 మందికి ఆపరేషన్లు చేయాల్సి ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ‘బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి రోజుకు 5-7 ఆపరేషన్లు చేస్తున్నాం’ అని ఆయన తెలిపారు. ‘గతేడాది బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో చాలా మంది చనిపోయారు. కొందరు చూపు కోల్పోయారు. కొందరిలో ముక్కు, దవడ ఎముకను కూడా తొలగించాల్సి వచ్చింది’ అని గంగారాం దవాఖాన ఈఎన్టీ సర్జన్ మనీశ్ ముంజల్ చెప్పారు.
అవయవ మార్పిడి చేసుకొన్నవారికి ప్రమాదం
అవయవ మార్పిడి చేసుకొన్నవారు, ఐసీయూలో చికిత్స పొందుతున్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు, డయాబెటిస్, రోగనిరోధక శక్తి సమస్యలతో బాధపడుతున్నవారిలో బ్లాక్ ఫంగస్ మరణానికి దారి తీసే ప్రమాదం ఉంది. కరోనా చికిత్సలో వినియోగిస్తున్న స్టెరాయిడ్ల వల్ల శరీరంలో ఫంగస్ ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉన్నదని దవాఖాన ఈఎన్టీ విభాగం హెడ్ అజయ్ స్వరూప్ చెప్పారు. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా కూడా ఈ విషయాన్ని అంగీకరించారు.
మ్యూకోర్మైకోసిస్ లక్షణాలు:
జ్వరం, కండ్ల కింద నొప్పి, ముక్కు దిబ్బడ, కంటి చూపు తగ్గడం