కొత్తూరు, మే 7: కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్గా బాతుక లావణ్యదేవేందర్యాదవ్, వైస్ చైర్మన్గా డోలి రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించారు. షాద్నగర్ ఆర్డీవో రాజేశ్వరి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ముందుగా అన్ని వార్డుల కౌన్సిలర్లతో ఆర్డీవో రాజేశ్వరి ప్రమాణం చేయించారు. చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు ఎక్స్అఫీషియో సభ్యులుగా గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, బస్వరాజు సారయ్య హాజరయ్యారు. మొత్తం 12 వార్డులకు గాను 7 వార్డుల్లో టీఆర్ఎస్ గెలువగా.. 5 వార్డుల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో టీఆర్ఎస్ ఏడుగురు సభ్యులు, ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 10కి చేరింది.
మొదట సీఎం కేసీఆర్ సీల్డ్ కవర్లో పంపిన 8వ వార్డులో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి బాతుక లావణ్య పేరును ఎక్స్ అఫీషియో సభ్యురాలు, మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతిపాదించగా.. దీన్ని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య బలపరిచారు. కాంగ్రెస్కు కోరం లేకపోవడంతో వారు చైర్ పర్సన్ అభ్యర్థిని నిలబెట్టలేదు. దీంతో ఎన్నికల అధికారి బాతుక లావణ్యను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. వైస్ చైర్మన్ కోసం 12వ వార్డు నుంచి విజయం సాధించిన డోలి రవీందర్ పేరును ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ప్రతిపాదించగా.. 11 వార్డు కౌన్సిలర్ ప్రసన్నలత బలపరిచారు. కాంగ్రెస్ నుంచి ఎవరినీ పోటీలో నిలుపకపోవడంతో డోలి రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం చైర్పర్సన్, చైర్మన్లతో ప్రమాణం చేయించారు. పర్యవేక్షణాధికారిగా గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ శ్రీధర్ వ్యవహరించారు. కాగా, మూడో వార్డు సభ్యుడు కొస్గి శ్రీనివాస్కు కరోనా పాజిటివ్ రాగా, హోం ఐసోలేషన్లో ఉన్నాడు. దీంతో ఎన్నికల నియమావళి ప్రకారం అతడు వీడియో కాల్ ద్వారా ప్రమాణం చేశారు. అనంతరం ఓటింగ్లో కూడా పాల్గొన్నారు.
హాజరైన ప్రజాప్రతినిధులు..
ఈ ఎన్నిక సమావేశానికి మంత్రులు సత్యవతి, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ హాజరయ్యారు. ఎన్నిక అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
కేటీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని పని చేయాలి: గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మున్సిపల్ నూతన పాలకవర్గం సభ్యులు మంత్రి కేటీఆర్ను స్ఫూర్తిగా తీసుకొని పని చేయాలి. సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ విజయం సాధించడమే ఇందుకు నిదర్శనం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొత్తూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలి. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ లను రాష్ట్ర ప్రజలు విశ్వసించడం లేదు. అందుకు నాగార్జునసాగర్, ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం. టీఆర్ఎస్ పార్టీని ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు.
కొత్తూరును ఆదర్శంగా తీర్చిదిద్దాలి:మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
కొత్తూరు మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి. దేశానికే తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్గా నిలుస్తున్నది. ఒక వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి సాధిస్తున్నాం. మంత్రి కేటీఆర్ పట్టణాలకు అన్ని వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. 24 గంటల కరెంటు, తాగునీరు, మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యమిస్తున్నారు.
సీఎం కేసీఆర్పై ప్రజలకు అపార నమ్మకం: ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
మున్సిపల్, కొర్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు చూస్తే సీఎం కేసీఆర్పై రాష్ట్ర ప్రజలకు అపార నమ్మకం ఉందని స్పష్టమవుతున్నది. ప్రజలు ప్రలోభాలకు లొంగకుండా టీఆర్ఎస్కు ఓటు వేసి అద్భుత విజయాన్ని అందించారు. షాద్నగర్ నియోజకవర్గ ప్రజల అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ముందుంటారు. ఇక్కడ తాగునీటి గోస తీర్చాం… త్వరలోనే సాగునీరు అందిస్తాం.
ఈ గెలుపు సీఎం కేసీఆర్కు అంకితం: ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
కొత్తూరు మున్సిపాలిటీ గెలుపు సీఎం కేసీఆర్కు అంకితం. మేము ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్ వంటి పథకాలను అందించిన టీఆర్ఎస్కే ఓటు వేస్తామని ప్రజలు చెప్పారు. తాగడానికి నీళ్లు ఇచ్చిన టీఆర్ఎస్ను గెలిపిస్తామని తెలిపారు. కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తాం. టీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.