సంగారెడ్డి, మే 5 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం దవాఖానలను వేగంగా ఆధునీకరిస్తున్నది. రోగులకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నది. ప్రస్తుత కరోనా విపత్కర వేళ ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్నది. సంగారెడ్డిలోని ప్రభుత్వ దవాఖానలో రూ.1.20 కోట్లు వెచ్చించి డయాగ్నోస్టిక్ హబ్ను ఏర్పాటు చేసింది. రోగికి వైద్యం అందించాలంటే రోగ నిర్ధారణ పరీక్షలు ముఖ్యం. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్ర దవాఖానలో పరిమితమైన రోగనిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. మిగతా పరీక్షలు ప్రైవేటులో చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఇది రోగులకు ఆర్థికంగా భారంగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రోగులకు అవసరమైన అన్ని డయాగ్నోస్టిక్ పరీక్షలు ఉచితంగా అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్ర దవాఖానలో డయాగ్నోస్టిక్ హబ్ ఏర్పాటు చేసింది. ఆధునిక కంప్యూటరైజ్డ్ యంత్రాలతో దీనిని ఏర్పాటు చేశారు. 57 రకాల పరీక్షలు ఇక్కడ ఉచితంగా చేస్తారు. డాక్టర్ పర్యవేక్షణ లో పది మంది సిబ్బంది డయాగ్నోస్టిక్ హబ్లో పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 17 నుంచి డ్రైరన్ నిర్వహిస్తున్నారు. త్వరలో పూర్తిస్థాయిలో సేవలను ప్రారంభించనున్నారు. సంగారెడ్డితో పాటు పొరుగు జిల్లాలైన మెదక్, రంగారెడ్డి, వికారాబాద్ నుంచి సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు రోగులు వస్తుంటారు. డయాగ్నోస్టిక్ హబ్ ప్రారంభంతో రోగులకు సౌకర్యంగా మారనుంది. సంగారెడ్డి జిల్లాలోని పీహెచ్సీల నుంచి రోగులకు సంబంధించిన రక్తనమూనాలను సేకరించి ఇక్కడి డయాగ్నోస్టిక్ హబ్లో పరీక్షలు చేసి ఫలితాలను రోగులకు అందజేస్తారు.
వేగంగా ఆర్టీపీసీఆర్ సెంటర్ ఏర్పాటు…
కరోనా నిర్ధారణ వేగంగా తెలుసుకునేందుకు సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో రివర్స్ ట్రాన్స్ప్రిక్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్(ఆర్టీపీసీఆర్)పరీక్షా కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. ఆర్టీపీసీఆర్ సెంటర్ ఏర్పాటు కోసం చురుగ్గా పనులు సాగుతున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్రావు చొరవతో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే వైద్యశాఖ అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి హరీశ్రావు, యుద్ధ్దప్రాతిపదికన పనులు పూర్తిచేసి ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. 15 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కరోనా నిర్ధారణ కోసం నమూనాలను సేకరించి హైదరాబాద్లోని ఫీవర్ దవాఖానకు పంపుతున్నా రు. వారు పరీక్షలు చేసిన అనంతరం ఫలితాలను నేరుగా ఫోన్ మెసేజ్ ద్వారా రోగులకు తెలియజేస్తున్నారు.
సంగారెడ్డిలో స్థానికంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించకపోవడంతో రోగనిర్ధారణలో జాప్యం జరుగుతున్న ది. దీనిని గమనించిన ప్రభుత్వం సంగారెడ్డిలో ఆర్టీపీసీఆర్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నది. రూ.1.02 కోట్లతో దీనిని ఏ ర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ సెంటర్ ఏర్పాటుకు కేటాయిం చిన భవనానికి మరమ్మతులు జోరుగా సాగుతున్నాయి. అవసరమైన యంత్రాలు వారం రోజుల్లో జిల్లాకు రానున్నాయి. పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రస్తుతం ఇద్దరు వైద్యులు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు, మరో ముగ్గురు సిబ్బంది హైదరాబాద్లో శిక్షణ పొందుతున్నారు.
త్వరలోనే పూర్తిస్థాయి డయాగ్నోస్టిస్ సేవలు
రోగనిర్ధారణ పరీక్షల కోసం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో డయాగ్నోస్టిక్ హబ్, ఆర్టీపీసీఆర్ కేంద్రం సేవలను త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రస్తుతం పరిమిత సంఖ్య లో డ్రైరన్ ద్వారా రోగనిర్ధారణ పరీక్షలు చేసి ఫలితాలను రోగులకు అందజేస్తున్నాం. 57 రకాల ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి తెస్తున్నాం. తద్వారా రోగులకు ఎంతో ఉపయోగకరం. సంగారెడ్డిలో ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని త్వరలో ప్రారంభిస్తాం. ప్రస్తుతం సివిల్ పనులు జరుగుతున్నాయి. అవసరమైన యంత్రాలు త్వరలో రానున్నాయి. దీనిద్వారా కరోనా నిర్ధారణ వేగంగా జరిగి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించవచ్చు.